ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబట్టిన వైసీపీ ఎంపీ: జగన్ వద్దే ఫైనల్
అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య ఎత్తులు పైఎత్తులు మొదలైపోయాయి. ఈ రెండు పార్టీలు కూడా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడంలో తలమునకలై ఉన్నాయి. జిల్లాపై పట్టు నిలుపుకోవడానికి వైఎస్ఆర్సీపీ కసరత్తు చేస్తోండగా.. ఈ సారి ఎలాగైనా గట్టిగా కొట్టాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది టీడీపీ.
క్లీన్ స్వీప్..
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. ఉమ్మడి అనంతపురంలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. టీడీపీకి దక్కింది- రెండే. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఈ రెండు నియోజకవర్గాలు అటొకటి ఇటొకటి అయ్యాయి. ఉరవకొండ అనంతపురంలో కొనసాగుతుండగా.. హిందూపురం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా పరిధిలోకి వచ్చింది.
టీడీపీ వ్యూహాత్మకంగా..
ఈ రెండు జిల్లాల్లో కూడా పసుపుజెండా ఎగరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. ఉరవకొండ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తోన్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికీ అదే స్థాయిలో ప్రాధాన్యత దక్కుతోంది.
పుట్టపర్తి జిల్లాపై..
ఇక పార్టీకి అండగా ఉంటూ వస్తోన్న పరిటాల సునీత ఫ్యామిలీకి శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా బాధ్యతలను అప్పగించారాయన. పరిటాల కుటుంబానికి ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలపై మంచి పట్టు ఉంది. ఈ సారి అభ్యర్థుల సీట్ల మార్పులోనూ చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలను ఆయన తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఓడిపోయిన అభ్యర్థులకు టికెట్లివ్వకుండా కొత్త వారిని ప్రోత్సహించేలా చంద్రబాబు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు సమాచారం.
ధీటుగా వైసీపీ..
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీకి చెందిన అనంతపురం లోక్ సభ సభ్యుడు తలారి రంగయ్య.. కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టపడట్లేదని, అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. కల్యాణదుర్గం టికెట్ ను తలారి రంగయ్య ఆశిస్తోన్నట్లు సమాచారం.
వైఎస్ జగన్ తో భేటీ..
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారాయన. కల్యాణదుర్గం నుంచి పోటీ చేయాలనే కోరికను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. సీట్ల మార్పునకు ఇంకా సమయం ఉందని, చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సి ఉన్నందున ఒకేసారి అన్నింటినీ పరిష్కరిద్దాం అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.
కల్యాణదుర్గంపై..
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గం.. కల్యాణదుర్గం. కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ భారీగా ఉంటుందిక్కడ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కుప్పాన్ని వదిలి.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటూ ఇదివరకు వార్తలు కూడా వచ్చాయి. అలాంటి స్థానాన్ని తలారి రంగయ్య కోరుకుంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన నియోజకవర్గాన్ని వదులుకోవడానికి ఉషా శ్రీచరణ్ అంగీకరిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది.
3- స్టేట్స్: ఈశాన్యం నుంచి మోగిన ఎన్నికల నగారా- బీజేపీకి అగ్నిపరీక్షే: మార్చి 2న..