తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి చెక్..!?
అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాపై తన పట్టు మరింత పెంచుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం వేస్తోన్న ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఈ రెండు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నందున- ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు.

క్లీన్ స్వీప్..
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం కూడా ఒకటి. జిల్లాలో ఉన్న మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..11 చోట్ల వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. ఉన్న రెండు లోక్ సభ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అనంతపురం నుంచి తలారి రంగయ్య, హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ ఘన విజయం సాధించారు. టీడీపీకి దక్కింది- రెండే. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలిచారు.

టీడీపీ వ్యూహాత్మకంగా..
ఈ రెండు జిల్లాల్లో కూడా పసుపుజెండా ఎగరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. ఉరవకొండ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్ కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తోన్నారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికీ అదే స్థాయిలో ప్రాధాన్యత దక్కుతోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ బ్రదర్స్ వారసులు పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఎదురుగాలి..
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎదురుగాలి వీచింది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా వీచినప్పటికీ- తాడిపత్రిలో మాత్రం చుక్కెదురైంది. తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. రాష్ట్రంలో 75 మున్సిపాలిటీల్లో టీడీపీకి దక్కిన ఒకే ఒక్క మున్సిపాలిటీ ఇదొక్కటే. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారిక్కడ. టీడీపీ తన పట్టును నిలపుకొన్నట్టయింది. దాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది కూడా.

కేతిరెడ్డి పెద్దారెడ్డి అనూహ్య నిర్ణయం..
ఈ పరిణామాల మధ్య వైసీపీ శాసన సభ్యుడు కేతిరెడ్డి పెద్దా రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించుకోవడానికి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ పాదయాత్ర మొదలు కానుంది. నిరాటంకంగా 15 రోజుల పాటు కొనసాగించనున్నారు. కొద్దిగా విరామం అనంతరం మళ్లీ దాన్ని పునరుద్ధరించనున్నారు. ఈ దిశగా ఇప్పటికే ఆయన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి క్యారవాన్ కూడా రెడీ అయింది.

పెద్ద వడుగూరు నుంచి..
నియోజకవర్గం పరిధిలోని పెద్ద వడుగూరు మండలం కాసేపల్లి నుంచి పెద్దారెడ్డి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఆ రోజంతా కాసేపల్లిలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తారు. అప్పటికప్పుడే వాటిని పరిష్కరించేలా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తారు. రాత్రి క్యారవాన్ లో విశ్రాంతి తీసుకుంటారు. ఈ మండలం పరిధిలోని గ్రామాల్లో 15 రోజుల్లో కాలినడకన పర్యటిస్తారు.

10 రోజుల విశ్రాంతి తరువాత..
పెద్దవడుగూరు మండలంలో పాదయాత్ర ముగిసిన తరువాత 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారాయన. అనంతరం రెండో విడతలో యాడికి మండలం నుంచి మలి విడత పాదయాత్ర చేపడతారు. తాడిపత్రి మున్సిపాలిటీ, పెద్దవడుగూరు, పెదపప్పూరు, యాడికి మండలాల్లోని ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేలా ఆయన పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటోన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తోన్నారు.












Click it and Unblock the Notifications