1000రోజుల జగన్ విధ్వంస పాలన; అన్నీ నేరాలు ఘోరాలే; టీడీపీ ప్రజా ఛార్జ్ షీట్!!
తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పై చార్జిషీట్ ను విడుదల చేసింది. టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, దీపక్ రెడ్డి తదితరులు జగన్ సర్కార్ పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వెయ్యి రోజుల జగన్ విధ్వంస పాలనలో వెయ్యి నేరాలు ఘోరాలు
సీఎం జగన్ 1000 రోజుల పాలన లో 1000 తప్పిదాలు అంటూ విడుదల చేసిన ఛార్జిషీట్ లో జగన్ పాలనలో రాష్ట్రం లో విధ్వంసం కొనసాగుతుందని విమర్శించారు. విధ్వంస పాలనలో 1000 నేరాలు-ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట ప్రజా ఛార్జిషీట్ విడుదల చేశామని టిడిపి నేతలు వెల్లడించారు. అసమర్థ పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ ఒక్కరే అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో కూల్చివేతలతో జగన్ పరిపాలన కొనసాగిందని, ప్రజా వేదిక కూల్చివేత తో పాలన మొదలైందని విమర్శలు గుప్పించారు.
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టటం కోసమే జగన్ మూడు రాజధానుల నిర్ణయం
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారని టిడిపి నేతలు మండిపడ్డారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు నిర్ణయం తో 135 సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పించారు. రెండు లక్షల కోట్ల సంపద అయిన అమరావతిని జగన్ తన కక్ష రాజకీయాలకోసం చంపేశారని విమర్శించారు.
సొంత బాబాయి వివేకాతో పాటు ఎంతో మంది మరణాలకు జగన్ సర్కార్ కారణం
వైసీపీ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు అని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఏళ్ళు జగన్ పాలనలో అన్ని నేరాలు, ఘోరాలు అంటూ మండిపడ్డారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి తో పాటు, కోడెల శివప్రసాదరావు, మా అక్క అడిగిన ఖర్మానికి వైద్యుడు సుధాకర్ ఇలా ఎంతో మంది చావులకు జగన్ సర్కార్ కారణమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.
శిశుపాలుడి వంద తప్పులు పూర్తి అయినట్టు జగన్ వెయ్యి తప్పులు పూర్తి
కక్ష సాధింపు కోసమే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు జగన్ వెయ్యి తప్పులు పూర్తయ్యాయని టిడిపి సీనియర్ నాయకుడు నక్క ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇకనైనా కళ్లు తెరవాలని విజ్ఞప్తి చేశారు. 75% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను సీఎం జగన్ మోసం చేశారని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. నిధులను దారి మళ్లించారు. ఏపీపీఎస్సీని జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మూడేళ్లలో కనీసం మూడు వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని, సంక్షేమం పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు.
జగన్ దుర్మార్గంతో ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి
సీఎం జగన్ దుర్మార్గం తో ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అని టిడిపి సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలు, ఎస్సీల పై దాడులు జరిగాయని నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కిడ్నాప్ లు, బెదిరింపులు, దాడులతో స్థానిక ఎన్నికలను అపహాస్యం చేశారని చినరాజప్ప వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచడం కోసం ఇసుక మాఫియా ను పెంచి పోషిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.