ఏపీలో కొత్తగా 1500కుపైగా కరోనా కేసులు: తగ్గిన రికవరీ, పెరిగిన యాక్టివ్ కేసులు, నెల్లూరులో త్యధికం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. ఓ రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువగా కేసులు ఉంటున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1500పైనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 63,717 నమూనాలను పరీక్షించగా.. 1502 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు, 16 మంది మృతి
తాజాగా నమోదైన 1502 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,19,702కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 16 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించగా చెందగా, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,903కి పెరిగింది.

ఏపీలో 14,883 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1525 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,90,916కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 14,883 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,68,73,491 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 260 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరం జిల్లాలో 17 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 21, చిత్తూరులో 208, తూర్పుగోదావరిలో 191, గుంటూరులో 143, కడపలో 113, కృష్ణాలో 129, కర్నూలులో 20, నెల్లూరులో 260, ప్రకాశంలో 152, శ్రీకాకుళంలో 38, విశాఖపట్నంలో 64, విజయనగరంలో 17, పశ్చిమగోదావరిలో 146 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,86,535, చిత్తూరులో 2,38,953 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,478) కరోనా కేసులున్నాయి.
Recommended Video

విద్యార్థులు, టీచర్లకు సోకుతున్న కరోనా
ఏపీలో విద్యాలయాలు ప్రారంభమైన నాటి నుంచి పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో పది మంది కరోనా బారినపడ్డారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్గా తేలింది. బాపట్ల మండలం నరసాయపాలెంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు కరోనా పాజిటివ్ అనే తేలింది. వారిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు నలుగురు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలల్లో శానిటైజ్ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గురు పూజోత్సవాలను ఏపీ సర్కారు రద్దు చేసింది. కాగా, వినాయక చవితి వేడుకలను కూడా ఇళ్లల్లోనే జరుపుకోవాలని సీఎం జగన్ సూచించిన విషయం తెలిసిందే. పబ్లిక్ ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు.












Click it and Unblock the Notifications