ఏపీలో 2, తెలంగాణాలో 2 డెల్టా ప్లస్ కేసులు నమోదు .. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కరోనా తాజా పరిస్థితిపై, భారతదేశంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్ రకాలపై లోక్ సభకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు అడిగిన ప్రశ్నలకు కేంద్ర, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ రెండు కేసులు నమోదైనట్లుగా ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు భారతదేశంలో ఈనెల 23వ తేదీ వరకు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ 70 కేసులు వెలుగు చూడగా అందులో తెలుగు రాష్ట్రాల్లో 4 నమోదైనట్లు ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి మహారాష్ట్రలో అత్యధికంగా 23 కేసులు నమోదైనట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో 11 కేసులు, తమిళనాడులో 10 కేసులు, చండీగఢ్ లో 4 కేసులు, కేరళ, కర్ణాటకలో 3 చొప్పున కేసులు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో రెండేసి కేసులు నమోదు కాగా ఉత్తరాఖండ్, జమ్ము, రాజస్థాన్, ఒడిస్సా హిమాచల్ ప్రదేశ్, హర్యానాలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
13 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో 28 జీనోమిక్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లలో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ కు సంబంధించిన sars cov2 కు చెందిన 58,240 నమూనాలను సీక్వెన్సింగ్ చేసి 46,124 శాంపిళ్లపై విశ్లేషణ చేసినట్లుగా వెల్లడించారు. ఇక విశ్లేషించిన నమూనాలలో 4,172 ఆల్ఫా వేరియంట్, 217 బీటా వేరియంట్, ఒక గామా వేరియంట్ ఉన్నట్టు, 70 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గుర్తించినట్లుగా ఆయన తెలిపారు.