ఉలిక్కిపడ్డ ఆళ్ళగడ్డ: వైసిపి నేత గంగుల అనుచరుడు సహా ఇద్దరి హత్య
కర్నూలు జిల్లాలో జంట హత్యల కలకలం చెలరేగింది. శిరువెళ్ల మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్ రెడ్డి (54), అతడి బావమరిది శ్రీనివాస రెడ్డి (52) దారుణ హత్యకు గురయ్యారు.
కర్నూలు: కర్నూలు జిల్లాలో జంట హత్యల కలకలం చెలరేగింది. శిరువెళ్ల మాజీ ఎంపీపీ ఇందూరు ప్రభాకర్ రెడ్డి (54), అతడి బావమరిది శ్రీనివాస రెడ్డి (52) దారుణ హత్యకు గురయ్యారు.
శనివారం సాయంత్రం ఈ ఇద్దరు తమ దినచర్యల్లో భాగంగా వాకింగ్కు వెళ్లారు. గ్రామం నుంచి మసీదుపురం రోడ్డులో వీరిద్దరూ నడుస్తుండగా ప్రత్యర్థులు ఒక్కసారిగా బండరాళ్లు, వేటకత్తులతో దాడికి తెగబడ్డారు.
దారుణంగా హతమార్చి ఇద్దరినీ పక్కనే ఉన్న కేసీ పంట కాల్వలో పడేశారు. వీరిద్దరు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. స్పందన లేకపోవడంతో వెతికారు.
దారి పక్కన ఉన్న కేసీ పంట కాల్వలో వీరి మృతదేహాలు కన్పించాయి. మృతుల శరీరాలపై బండరాళ్లతో మోదిన గాయాలతోపాటు వేటకొడవళ్లతో నరికిన గుర్తులు ఉన్నాయి.
ఇందూరు ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. ఈయన గంగుల కుటుంబానికి ఎంతో ఆప్తుడు. ఏ కార్యక్రమం జరిగినా ఈయన కీలకంగా వ్యవహరిస్తారు.
రాజకీయంగా గంగుల ఎటువైపు అడుగులు వేస్తే ఈయన అటే ఉంటారు. ఇందూరు తండ్రి ఇందూరు నారాయణరెడ్డి ముప్పై ఏళ్ల క్రితం రాజకీయ నేపథ్యంలో దారుణ హత్యకు గురయ్యారు.
కాగా, ఇందూరు ప్రభాకర్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డిని హతమార్చడం ద్వారా ఘటనకు ప్రత్యక్ష సాక్షి లేకుండా చేసుకున్నారు.
ఈ జంట హత్యలతో ఆళ్లగడ్డ మరోసారి ఉలిక్కి పడింది. ఘటనాస్థలిని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర రెడ్డి, సీఐలు ప్రభాకర్ రెడ్డి, దస్తగిరి బాబు పరిశీలించారు. ఘటనకు జరిగిన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే కారకులెవరో తేలుస్తామన్నారు.