కింగ్ మేకర్, దెబ్బకు దెబ్బ: రాహుల్తో బాబు దోస్తీకి 5 కీలక ఫ్యాక్టర్స్
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ పొత్తు లేదా అవగాహనపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పొత్తు అంశంపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు లేదని చెబుతూనే, ఏపీకి న్యాయం చేసే వారితో అందరితో కలిసి నడుస్తామని చెబుతున్నారు.
తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై ప్రచారానికి ఫుల్స్టాప్ పడటం లేదు. దాదాపు తెలంగాణలో టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఖరారైనట్లుగా నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కాంగ్రెస్తో వద్దని, తెరాసతో వెళ్దామని చెప్పిన మోత్కుపల్లి నర్సింహులును పార్టీ నుంచి బహిష్కరించారు.
కాంగ్రెస్తో పొత్తుపై టీడీపీలో చర్చ, విభేదిస్తున్న కొందరు నేతలు
పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో పొత్తు దాదాపు ఖాయమైందని, ఏపీలో అవగాహనతో ముందుకు సాగుతారని అంటున్నారు. కాంగ్రెస్తో పొత్తుపై (ఏపీ, తెలంగాణలలో) తెలుగుదేశం పార్టీలో చర్చ సాగుతోంది. దీనిని పార్టీలోని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తుండగా, మరికొంతమంది సమర్థిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ - టీడీపీ పొత్తుకు లేదా అవగాహనకు అవకాశముందని, అందుకు ఐదు ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెబుతున్నారు.
రాహుల్తో బాబు దోస్తీ, మోడీకి దగ్గరవుతున్న జగన్-కేసీఆర్
ఏపీకి బీజేపీ మోసం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉండి ఇప్పుడు మోసం అని చెప్పడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన బీజేపీ మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో కలిసి బీజేపీకి బుద్ధి చెప్పాలని చూస్తోందని అంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ తన తప్పును సరిదిద్దుకొని ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పడాన్ని టీడీపీ నేతలు కారణంగా చూపించవచ్చునని అంటున్నారు. ఇటీవల చంద్రబాబు కాంగ్రెస్కు దగ్గరవుతుంటే, జగన్, కేసీఆర్లు ప్రధాని మోడీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది.
మోడీని కార్నర్ చేసేందుకు మిగిలిన ఆయుధం
కాంగ్రెస్ పార్టీని దుష్ట పార్టీగా విమర్శించినా, అంతకుమించి మాట్లాడినా.. ఇప్పుడు ప్రధాని మోడీని కార్నర్ చేసేందుకు జాతీయస్థాయిలో చంద్రబాబుకు ఉన్న అవకాశం అదే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. 2014లో ఇచ్చిన హామీల విషయంలో టీడీపీ, బీజేపీ విఫలమయ్యాయని విపక్షాలు ఆరోపిస్తుండగా, ఆ ప్రజా వ్యతిరేకతను కేవలం బీజేపీ పైకి నెట్టివేయాలని చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్తో.. ఎలా చూసినా కింగ్ మేకర్ చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో తమకు కేంద్రంలో పూర్తి మెజార్టీ వస్తుందని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలే చెప్పలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్కు అవసరమైతే మద్దతు ఇచ్చి కేంద్రంలో కింగ్ మేకర్గా చంద్రబాబు మారే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా జూనియర్ పార్ట్నర్గా మారితే చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశముందని అంటున్నారు. లేదా ప్రాంతీయ పార్టీలను సమీకరించేందుకు చంద్రబాబు అవసరం కాంగ్రెస్కు ఏర్పడవచ్చునని చెబుతున్నారు. వాజపేయి హయాంలో చంద్రబాబు కింగ్ మేకర్గా ఉన్నారు.
అక్కడ వారికి, ఇక్కడ వీరికి
ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ఏపీలో ఆ పార్టీ బలం పుంజుకునే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ అవసరం, అలాగే కేంద్రంలో చంద్రబాబు అవసరం రాహుల్ గాంధీకి పడవచ్చునని అంటున్నారు. అలాగే, రాహుల్కు రాజకీయాల్లో చంద్రబాబు కంటే చాలా తక్కువ అనుభవం ఉంది. ఇరు పార్టీల మధ్య అవగాహనకు ఇది అసౌకర్యాన్ని కలిగించదని అంటున్నారు.
తెలంగాణలో తోడు అవసరం
తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోను తమకు ఆ పార్టీ అండగా ఉంటుందని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. తెలంగాణలో తిరిగి పార్టీ బలపడాలంటే కాంగ్రెస్ అవసరం ఉందని భావిస్తున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ నుంచి టీడీపీని కాపాడుకోవాలంటే కాంగ్రెస్తో వెళ్లడం మంచిదని చాలామంది చెబుతున్నారట.