ఏపీలో 400 దాటిన కరోనా వైరస్ కేసులు -కొత్తగా మరో 21 మంది బాధితుల గుర్తింపు..
ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్య ఇవాళ 400 మార్క్ దాటిపోయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను గమనిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతున్నట్లు భావించినా నిన్నటి నుంచి ఇవాళ ఉదయం వరకూ కొత్తగా 21 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. లాక్ డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తాజా హెల్త్ బులిటెన్ ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో 400 దాటిన కరోనా కేసులు..
ఏపిలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గత మూడు రోజులో పోలిస్తే ఇవాళ కాస్త పెరిగింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 21గా నమోదైంది. దీంతో ఇప్పటివరకూ ఏపీలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 402కు చేరిపోయింది. నిన్న మొన్నటి వరకూ కాస్త అదుపులో ఉందని భావించిన పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంపై అధికార యంత్రాంగంలోనూ ఆందోళన కనిపిస్తోంది.
ఆ జిల్లాల్లోనే కొత్త కేసులు..
తాజాగా ఏపీలోని నాలుగు జిల్లాల్లోనే కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 402కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల జాబితాలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. వీటిలో కర్నూలు జిల్లాలో 82 కేసులు, గుంటూరు జిల్లాలో 72, నెల్లూరు 48, ప్రకాశం 41 కేసులు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. ఇప్పటివరకూ కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య ఆరు కాగా.. ఆస్పత్రుల్లో చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11గా ఉంది.