గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు: దేశవ్యాప్తంగా 1,000కి పైగా
Covid 19 cases in Andhra Pradesh: కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే గైడ్ లైన్స్ సైతం జారీ చేసింది.
ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. ఢిల్లీలోనూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,000ని దాటడం కలకలం రేపుతోంది. ఆందోళనకు గురి చేస్తోంది.

ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా గుంటూరు జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తోన్నాయి. ఏలూరుకు చెందిన భార్యభర్తలు ఈ వైరస్ బారిన పడ్డారు. అలాగే- తెనాలికి చెందిన ఓ వృద్ధుడిని డాక్టర్లు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కేరళలో అత్యధికంగా 430 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర- 209, ఢిల్లీ- 104, కర్ణాటక- 47 కేసులు రికార్డయ్యాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ వీటి తీవ్రత నెలకొంది. ఒక్క రోజులోనే మొత్తంగా 1,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ఎంట్రీ ఇవ్వని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైనా ఉన్నాయంటే అవి- అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మాత్రమే.
దేశంలో కోవిడ్ కు తొలి మరణం నమోదైంది. బెంగళూరులో ఒకరు మృతి చెందారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. బెంగళూరు వైట్ ఫీల్డ్ కు చెందిన ఆ వ్యక్తి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇటీవలే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ మరణించారు.
కోవిడ్ వల్ల ఆ వ్యక్తి మరణించినట్లు కర్ణాటక వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు నిర్ధారించారు. కర్ణాటక వ్యాప్తంగా కొత్తగా అయిదు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, మైసూరు, విజయనగర, బెళగావి జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్ తీవ్రత అధికంగా ఉంటోంది. ఒక్క బెంగళూరులోనే 30 కొత్త కేసులు నమోదు కావడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు. బెళగావిలోని బెంగళూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా పలు ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమం తప్పకుండా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోన్నారు.












Click it and Unblock the Notifications