ఏపీలో భారీగా తగ్గిన కరోనా: పశ్చిమగోదావరిలో అత్యధికం, అనంతపురంలో సింగిల్ డిజిట్, జిల్లాల్లో ఇలా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అతి స్వల్పంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం 300కుపైగానే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 500కుపై కరోనా బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
ఏపీలో కొత్తగా 305 కరోనా పాజిటివ్ కేసులు
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 44,935 కరోనా పరీక్షలు నిర్వహింగా.. కొత్తగా 305 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,75,836కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఆ రెండు మరణాలు కూడా ఒక్క నెల్లూరు జిల్లాలోనే సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7059కి చేరింది.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 8, చిత్తూరులో 43, తూర్పుగోదావరిలో 28, గుంటూరులో 24, కడపలో 12, కృష్ణాలో 37, కర్నూలులో 12, నెల్లూరులో 27, ప్రకాశంలో 21, శ్రీకాకులంలో 15, విశాఖపట్నంలో 19, విజయనగరంలో 14, పశ్చిమగోదావరిలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 541 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8,64,049కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 4728 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,08,75,925 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,23,016 కేసులుండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 40,876 కరోనా కేసులున్నాయి.
దేశంలో మూడున్నర లక్షలకు యాక్టివ్ కేసులు
ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 8,55,157 మంది నమూనాలను పరీక్షించగా.. 27,071 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 98,84,100 మంది వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,52,586 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 336 మరణాల సంభవించగా.. ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1,43,355కు చేరింది.