పవన్ కల్యాణ్ దృష్టిలో 4 నియోజకవర్గాలు?
ఏపీ అసెంబ్లీకి 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. గాజువాకతోపాటు పశ్చిమగోదావరిలోని భీమవరం నుంచి పోటీచేసినప్పటికీ రెండుచోట్లా నిరాశే ఎదురైంది. పవన్ కల్యాణ్ పోటీపడ్డ ఈ రెండు నియోజకవర్గాల్లోను తెలుగుదేశం పార్టీ మూడోస్థానానికి పడిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న పవన్ ఏ నియోజకవర్గం నుంచైతే సులవుగా గెలుపు గుర్రం ఎక్కవచ్చంటూ ఒక ప్రయివేటు సంస్థచేత సర్వే నిర్వహింప చేయించారు.

తిరుపతి, పిఠాపురం అత్యంత సేఫ్!
సర్వే నిర్వహించిన సంస్థ నాలుగు నియోజకవర్గాలను సూచించినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అయితే పవన్ కల్యాణ్ సులువుగా గెలుపు గుర్రం ఎక్కేస్తారంటూ ఇక్కడి నాయకులు, కార్యకర్తలు కూడా గతంలో పలుమార్లు ఆహ్వానం పంపించారు. ఇప్పుడు సర్వేలో కూడా ఈ నియోజకవర్గం పేరు ఉంది. సంస్థ సూచించిన మరో నియోజకవర్గం చిత్తూరు జిల్లా తిరుపతి. గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారుకానీ సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. తిరుపతి పట్టణంలో సామాజికవర్గ దన్నుతోపాటు అభిమానుల బలం ఎక్కువ. దీంతో తిరుపతి లేదంటే పిఠాపురం అయితే పవన్ కు బాగుంటుందంటూ పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.

చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలంటే..
మరోవైపు ఈ రెండు కాకుండా మరో రెండు నియోజకవర్గాలను కూడా సంస్థ గుర్తించింది. వీటిలో కాకినాడ రూరల్ ఒకటి. ప్రస్తుతం ఇక్కడి నుంచి కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీచేస్తే కాకినాడ సిటీపై కూడా ప్రభావం ఉంటుందని, ఈసారి ఎన్నికల్లో కాకినాడ టౌన్ నుంచి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేశారు కాబట్టి రూరల్ నుంచి పోటీచేయాలంటూ అభిమానులు కూడా కోరుతున్నారు. రూరల్ లో సామాజికవర్గం బలం ప్రబలంగా ఉంది.

పవన్ కల్యాణ్ సభలో ఉండాలి!!
తర్వాత సూచించిన మరో నియోజకవర్గం విశాఖపట్నం ఉత్తరం. గత ఎన్నికల్లో విశాఖపట్నం టౌన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోను టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉండటంతోపాటు పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి సునాయాసంగా విజయం సాధించవచ్చని తేలింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందనే యోచన పార్టీలో వ్యక్తమవుతోంది. పవన్ కల్యాణ్లాంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే బాగుంటుందని ప్రజాస్వామ్య వాదులు ఆకాంక్షిస్తున్నారు. చూడాలి.. పవన్ ఏ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటారో.!!












Click it and Unblock the Notifications