నారాయణ క్యాంపస్లో విద్యార్ధుల ఫైటింగ్: 40 మందికి గాయాలు
విశాఖపట్నం: నగరంలోని మధురవాడలో ఉన్న మిథులాపురి కాలనీలోని నారాయణ కాలేజ్ క్యాంపస్లో శనివారం తెల్లవారుజామున విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులకు దిగారు.
ఈ ఘర్షణలో 40 మంది విద్యార్ధులకు గాయలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన విద్యార్ధులను చికిత్స నిమిత్తం ఉజ్వల ఆస్పత్రికి తరలించారు. వాటర్ విషయంలో విద్యార్ధులు గొడవ పడినట్లు విశాఖ డీసీపీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
సీబీఎసీ తెలుగు విద్యార్థులు, నార్త్ఇండియన్స్ విద్యార్థులు ఈ గొడవలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో కొంత మంది విద్యార్ధులు చెయిన్లను కూడా ఉపయోగించారని తెలిపారు. దీంతో 40 మంది వరకు గాయలపాలయ్యారు.
వారిలో 35 మందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. మరో ఐదుగురు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్ధుల ఘర్షణకు సంబంధించి కాలేజీ యాజమాన్యం పోలీసులకు శనివారం ఉదయం సమాచారం అందించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు విద్యార్ధులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. వాటర్ వివాదంపై గత రాత్రి ఏడు గంటల ప్రాంతంలోనూ ఘర్షణ జరిగిందని, యాజమాన్యం ఉండటంతో గొడవ సర్దుమణిగిందని తెలిపారు.
రెండో సారి తెల్లవారుజామున గొడవ జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో తీవ్రంగా కొట్టుకున్నారని ఆయన చెప్పారు.