48వ రోజుకు రాజధాని నిరసనలు..24 గంటల దీక్షకు రైతులు
ఏపీలో రాజధానిఅమరావతి కోసం పోరాటం సాగుతూనే ఉంది . రాజధాని అమరావతిని కాపాడాలని అమరావతి రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోపక్క ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు అధికారికంగానే అడుగులు వేస్తున్న పరిస్థితి రాజధాని రైతులకు మరింత ఆందోళన కలిగిస్తుంది.ఇక రాజధాని రైతుల ఆందోళనలు 48వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి.
48వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు
రాజధాని అమరావతి కోసం వెలగపూడిలో 48వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు 24 గంటలకు దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.నేడు మందడం, వెలగపూడిలోను 24 గంటల దీక్షకు రైతులు కూర్చోనున్నారు. అంతేకాదు ఏపీ సర్కార్ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న రాజధాని ప్రాంత రైతులు రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఢిల్లీ కి వెళ్లారు రాజధాని ప్రాంత రైతులు .
రాజధానిగా అమరావతి కొనసాగాలని సేవ్ అమరావతి నినాదం.. పట్టించుకోని సర్కార్
ఇక సేవ్ అమరావతి నినాదం రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్నారు రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు. అయినా సర్కార్ మాత్రం మొండిగానే ముందుకు వెళ్ళటం ఏ మాత్రం రుచించటం లేదు. అమరావతికి మద్దతుగా అన్ని చోట్లా ర్యాలీలు, ఆందోళనలు జరుగుతున్నాచూసీ చూడనట్టే వ్యవహరిస్తోంది. 3 రాజధానులపై నిర్ణయం తీసుకున్న వైసీపీ సర్కార్ రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా ముందుకే వెళ్తోంది.
రాజధాని కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం అంటున్న రాజధాని రైతులు
ఈ పరిణామాలపై అమరావతికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం రాజధాని అమరావతి రైతులకు బాసటగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు .శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమ సహనం పరీక్షించొద్దని అంటున్నారు. రాజధాని అమరావతి కోసం ఎంత కాలం అయినా పోరాటం సాగిస్తామని చెప్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఎవర్ని కదిపినా ఉద్వేగానికి లోనవుతున్నారు. తమ భవిష్యత్తో ఆటలాడుతున్న సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే పోరాటం సాగిస్తున్నారు.