కొత్త జిల్లాలపై 7,500 అభ్యంతరాలు; అత్యధికంగా ఆ జిల్లా నుండే: ప్రణాళికాశాఖ కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పై అభిప్రాయ సేకరణ చేస్తున్న ప్రభుత్వం, ప్రజల నుండి సలహాలను, సూచనలను తీసుకుంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలను గురించి ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు.
Recommended Video
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికి 7500 అభ్యంతరాలు, విజయనగరం జిల్లా టాప్
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7500 అభ్యంతరాలను కలెక్టర్లకు అందజేశారని, ఒక్క విజయనగరం జిల్లా నుంచే 4500 అభ్యంతరాలను తెలియజేశారని ఆయన పేర్కొన్నారు .అభ్యంతరాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అంశాల వారీగా చూస్తే కేవలం అరవై అంశాలలోనే అభ్యంతరాలు ఉన్నట్టుగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అభ్యంతరాలలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉండగా తర్వాత అధికంగా కృష్ణా జిల్లా నుండి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇక అభ్యంతరాలు అన్నింటినీ క్రోడీకరించి సీఎం జగన్ కు నివేదించనున్నట్లుగా ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు.
మార్చి నెలాఖరులోగా తుది నోటిఫికేషన్
లోక్సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని జిల్లాల పునర్విభజన చేయడంవల్ల కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరి ఆకాంక్షలను పూర్తిచేసే విధంగా తుది మార్పులు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మార్చి నెలాఖరు లోపు తుది నోటిఫికేషన్ ఇస్తామని, కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజన కూడా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. రేపటితో అభ్యంతరాలను స్వీకరించేందుకు తుదిగడువు ముగియనుంది అని పేర్కొన్నారు. ఇంకా ఎవరికైనా అభ్యంతరాలుంటే రేపటి లోపు సమర్పించాలని ఆయన వెల్లడించారు.
రేపటితో ముగియనున్న అభ్యంతరాల గడువు
సాధ్యమైనంత వరకూ జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. రేపటితో అభ్యంతరాలు స్వీకరణ తుది గడువు ముగియనుంది. ఆపై వారం రోజులపాటు అభ్యంతరాల పై అధ్యయనం చేస్తామని, సహేతుకమైన సమస్యలను పరిగణలోకి తీసుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని విజయ్ కుమార్ వెల్లడించారు.
అభ్యంతరాలను, సలహాలు, సూచనలను పరిశీలించనున్న ఉన్నత స్థాయి కమిటీ
ఇదిలా ఉంటే కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలను ప్రజల నుండి వచ్చే సూచనలను, సలహాలను క్షుణ్నంగా పరిశీలించి అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సిసిఎల్ఎ కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటు చేసిన జగన్ సర్కార్ అభ్యంతరాలపై అధ్యయనం చేయడానికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించాలని సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే అభ్యంతరాలను, సూచనలను స్వీకరిస్తున్న కలెక్టర్ లు వారు అందుకున్న విజ్ఞప్తులను www.drp.ap.gov.in వెబ్ సైట్ లో ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా అప్లోడ్ చేసే ప్రతి అభ్యంతరాన్ని, సూచనను పరిశీలించి, దానిపై వారి అభిప్రాయం రాయాల్సి ఉంటుంది.
మార్పులు చేర్పులు అవసరం అనుకుంటే మార్చే ఛాన్స్
ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. అన్ని అభ్యంతరాలను పరిశీలించి సహేతుకమైన అభ్యంతరాలు అయితే వాటిని పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తదనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో దూకుడుగా ముందుకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల విషయంలో అభ్యంతరాల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.