75 సార్లు పర్యటించి, వెయ్యి హామీలు: విశాఖకు వంచన, కంటకుడు పార్ట్-10లో విజయసాయి..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి విశాఖ కంటకుడు పేరుతో.. నగరానికి చేసిన అన్యాయం గురించి వరసగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరక 9 పోస్టులు చేయగా.. ఇవాళ మరో పోస్ట్ వదిలారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి విశాఖ నగరానికి చేసిందేంటీ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయని.. కానీ పనులు మాత్రం జరగలేదన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో 600 హామీలిచ్చి ఒక్కటీ కూడా నెరవేర్చలేదని ఫైరయ్యారు.
విశాఖకు బీచ్ తెచ్చింది, సబ్ మెరైన్ తెచ్చింది చంద్రబాబే.. విజయసాయి విసుర్లు
75 సార్లు పర్యటించి..
గత ప్రభుత్వ హయాంలో నగరానికి 75 సార్లు వచ్చారని.. వెయ్యి వరకు హామీలు గుప్పించారని విజయసాయి గుర్తుచేశారు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని స్పష్టంచేశారు. బిల్ గేట్స్, బిట్స్ పిలానీ అంటూ హడావిడి చేశారని మండిపడ్డారు. సిటీ ఆఫ్ డెస్టినీకి ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో అభివృద్దికి నోచుకొని విశాఖను తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తోందని తెలిపారు. తమకు సహకరించాల్సింది పోయి.. అడ్డుపడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హుద్ హుద్ బాధితులకు పరిహారం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 2014లో హుద్ హుద్ తుపాను వస్తే 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని ప్రశ్నించారు. కానీ ఎందుకు బాధితులను ఆదుకోలేదని సూటిగా నిలదీశారు.
పోర్టుల పేరుతో మోసం..
విశాఖపట్నం - కృష్ణపట్నం మధ్య 15 నుంచి 16 పోర్టులు వస్తాయని చెప్పలేదా అని విజయసాయి అడిగారు. జిల్లాకో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని కబుర్లు చెప్పలేదా అన్నారు. ఒక ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మించలేదు అని దుయ్యబట్టారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం జిల్లాకో ఫిషింగ్ హార్బర్ కేటాయించిందని తెలిపారు. వాటికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేసిందని తెలిపారు. విశాఖలో ఫుడ్ పార్క్, ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్, లాజిస్టిక్ హబ్, ఎలక్ట్రానిక్స్ హబ్, ఐటీ హబ్, మెరైన్ వర్సిటీ, ఏవియేషన్ హబ్ అంటూ చంద్రబాబు హామీలు ఇచ్చారని విజయసాయి తెలిపారు. మెడికల్ హబ్, ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తానని చంద్రబాబు ఆశలు కల్పించారని మండిపడ్డారు. కానీ ఒక ఆస్పత్రి, డిగ్రీ కాలేజ్ కేటాయించలేదని విమర్శించారు.
మెడికల్ కాలేజీ, ఆస్పత్రి అంటూ వంచన
జిల్లాకో మెడికల్ కాలేజ్, ఆస్పత్రి మంజూరు చేసిన ఘనత వైఎస్దేనని విజయసాయి స్పష్టంచేశారు. అధికారంలో ఉన్న తొలి రెండుసార్లు విజన్ 2020 అని చంద్రబాబు పిలుపునిచ్చారని.. 2014లో మాత్రం విజన్ 2029 అన్నారని తెలిపారు. తర్వాత అదీ 2050కి మార్చారని ధ్వజమెత్తారు.14 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేనందున.. టైమ్ మార్చారా అని ప్రశ్నించారు. కానీ తమ ప్రభుత్వం విశాఖలో అభివృద్ధి ఒక్కచోట వికేంద్రీకరిస్తున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. మధురవాడ, తగరపువలస, ఆటోనగర్, లంకెలపాలెం, హనుమంతవాక, గాజువాకను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విశాఖ టూరిజాన్ని చంద్రబాబు భ్రష్టుపట్టించారని విమర్శించారు.
Recommended Video
దళిత రైతులు ఎందుకు తిరగబడ్డారు..
ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను.. పాలన, ఆర్థిక, పర్యాటక రాజధానిగా మార్చేందుకు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఇదీ తమ ప్రభుత్వ విధానం అని.. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్, ఐటీ అంటారని విమర్శలు చేశారు. వాస్తవానికి ఐటీకి పునాది వేసింది రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని పేర్కొన్నారు. 1991-95 మధ్యకాలంలో హైదారాబాద్లో ఐటీ అభివృద్ధి వందశాతం ఉండేదన్నారు. అమరావతిలో చంద్రబాబు బస్సు యాత్ర చేస్తే దళిత రైతులు ఎందుకు తిరగబడ్డారని విజయసాయి ప్రశ్నించారు. చంద్రబాబు, తెలుగుదేశం నేతలు వెళ్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు ఎందుకు విసిరారని నిలదీశారు. వాస్తవం జనాలకి తెలిసిన సమయంలో ఇలానే జరుగుతుందన్నారు.