ఏపీలో 2 కోట్లు దాటిన టెస్టులు: స్వల్పంగా పెరిగిన కేసులు, తగ్గిన మరణాలు, యాక్టివ్ కేసుల్లో క్షీణత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 9వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, అంతకుముందు రోజు కంటే స్వల్పంగా కొత్త కేసులు పెరిగాయి. మరణాల సంఖ్య మాత్రం కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 93,511 నమూనాలను పరీక్షించగా.. 8766 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 8766 కరోనా కేసులు, 68 మరణాలు
తాజాగా నమోదైన 8766 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది మృతి చెందారు. చిత్తూరులో అత్యధికంగా 11 మంది మరణించగా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశంలో ముగ్గురు, కడప, నెల్లూరులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 11,696కు చేరింది.
ఏపీలో రికవరీలు పెరగడంతో పడిపోతున్న యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,292 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 16,64,082కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,00,39,764 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1980 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 265 మంది కరోనా బారినపడ్డారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 960, చిత్తూరులో 974, తూర్పుగోదావరిలో 1980, గుంటూరులో 520, కడపలో 582, కృష్ణాలో 339, కర్నూలులో 338, నెల్లూరులో 391, ప్రకాశంలో 711, శ్రీకాకుళంలో 277, విశాఖపట్నంలో 592, విజయనగరంలో 265, పశ్చిమగోదావరిలో 837 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,42,794, చిత్తూరులో 2,03,513 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో లక్షకు మించిపొయాయి.