అమరావతి ఉద్యమానికి 800రోజులు: వెలగపూడిలో ప్రజాదీక్ష; జగన్ టార్గెట్ గా లోకేష్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు 800 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని నిర్ణయం తీసుకున్న నాటి నుండి నేటి వరకు అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు 800 రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని నిర్ణయం తీసుకున్న నాటి నుండి నేటి వరకు అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఉద్యమం 800రోజుల సందర్భంగా అమరావతి ప్రజాదీక్ష
ఇప్పటికీ రాజధాని అమరావతి కోసం రైతులు నిరంతర పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి ఉద్యమం 800 రోజుకు చేరిన సందర్భంగా రాజధాని రైతులు అమరావతి ప్రజా దీక్ష పేరుతో దీక్ష చేపట్టారు. వెలగపూడి లో 24 గంటల పాటు రైతుల సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు . ఉదయం 9:00 నుండి 24 గంటల పాటు దీక్ష చేస్తున్నట్లుగా అమరావతి రైతులు ప్రకటించారు. ఇదే సమయంలో మార్చిలో ఉత్తరాంధ్ర నుంచి జేఏసీలను ఏర్పాటు చేస్తామని, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని రాజధాని రైతులు వెల్లడించారు.
రైతుల ఉద్యమానికి బాసటగా టీడీపీ
ఇక రాజధాని రైతుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండగా ఉంటుంది.రాజధాని రైతులకు మద్దతుగా వైసీపీ మినహాయించి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి రైతుల పోరాటానికి తమ వంతు మద్దతు తెలిపారు. కచ్చితంగా అమరావతి రైతులు విజయం సాధిస్తారని, న్యాయం గెలుస్తుందని చెప్తున్నారు. రాజధాని అమరావతి రైతులకు బాసటగా టీడీపీ తన గళాన్ని వినిపిస్తూనే ఉంది.
రాజధాని అమరావతిపై జగన్ టార్గెట్ గా నారా లోకేష్ ట్వీట్
రాజధాని అమరావతి ఉద్యమం ఎనిమిది వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తున్న రైతులు, మహిళలు, యువతకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభి వందనాలు అంటూ పేర్కొన్నారు. నియంత గా మారిన పాలకుల విద్వేష నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని రాజధాని ప్రాంత రైతులను కొనియాడారు. రాష్ట్రానికి అమ్మ లాంటి అమరావతిని కూల్చాలని కుట్ర చేసిన జగన్ రెడ్డి గారు అన్ని రంగాలను కుప్ప కూల్చాడని నారా లోకేష్ మండిపడ్డారు. సంకుచిత బుద్ధితో జగన్ అండ్ కో చేసిన ప్రతి ఆరోపణ అబద్ధమే అని నిరూపిస్తూ అమరావతి ఠీవిగా నిలబడిందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆపేసిన అమరావతి గ్రోత్ ఇంజన్ ని మళ్లీ స్టార్ట్ చేయడం ఒక్కటే మార్గమని నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నా మారని సర్కార్ తీరు
రాజధాని అమరావతి కోసం రైతులు తమ ప్రాణ సమానమైన భూములను ప్రభుత్వానికి ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఇప్పటివరకూ అనేక రకాలుగా ఆందోళనలు చేసినా, తుళ్లూరు నుండి తిరుమలకు పాదయాత్ర చేసి ప్రజా మద్దతు కూడగట్టినా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు లేదు. మూడు రాజధానులు ఏర్పాటుపై వెనక్కు తగ్గేది లేదని ఇప్పటికే అనేక మార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వెల్లడించడం రాజధాని విషయంలో మారని ప్రభుత్వ విధానానికి అద్దం పడుతుంది.
అణచివేతలు, ఎదురు దాడులు తప్ప రాజధాని అమరావతిపై నిర్ణయం మారలేదు
ఇప్పటి వరకు రైతులు విభిన్న రీతిలో తమ ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదు. ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందే తప్ప, రాజధాని అమరావతి రైతుల గోడు విన్న దాఖలాలు లేవు. తుళ్ళూరు నుండి తిరుమలకు న్యాయస్థానం టూ దేవస్థానం అని పాదయాత్ర చేసిన సమయంలోనూ ప్రభుత్వం అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది.
వైసీపీ మంత్రులు అమరావతి ఉద్యమంపై ఎదురు దాడి చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే మూడు రాజధానుల నిర్ణయం అని, త్వరలో మళ్ళీ బిల్లు పెడతామని చెప్తున్నారు వైసీపీ మంత్రులు.