ఏపీలో కొత్తగా 9881 కరోనా కేసులు... మరో 51 మంది మృతి... ఏ వేడుకకైనా 50 మందికే అనుమతి...
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో 9881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 51 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 10,43,441కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7736కి చేరింది.
Recommended Video
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 74,041 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,60,68,648 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 4431 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 9,40,574మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 95.131 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1592 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1302, గుంటూరు జిల్లాలో 1048, విశాఖపట్నంలో 1030 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 188 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో అత్యధికంగా చిత్తూరు,నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు,విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఏ వేడుకకైనా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది. క్రీడా ప్రాంగణాలు,జిమ్ సెంటర్లు,స్విమ్మింగ్ పూల్స్ను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. అలాగే ప్రజా రవాణా,సినిమా హాళ్లు 50శాతం ఆక్యపెన్సీతోనే నిర్వహించాలని ఆదేశించింది.
అన్ని కార్యాలయాల్లో వ్యక్తుల మధ్య 50 గజాల దూరం పాటించాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కోరారు.రెండెసివర్ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కోవిడ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం 11వేల రెండెసివిర్ వయల్స్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 341 టన్నుల ఆక్సిజన్ సరిపోవట్లేదన్నారు. చాలాచోట్ల ఆక్సిజన్ వృథా అవుతోందని... అవసరం లేకపోయినా ఆక్సిజన్ వాడుతున్నారని పేర్కొన్నారు.
కరోనా పరిస్థితులను అదునుగా చేసుకుని పేషెంట్లను ఆర్థికంగా దోపిడీ చేస్తున్న ఆస్పత్రులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రుల్లో చార్జీలపై ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చిందని... అన్ని ఆస్పత్రులు ఆ ఆదేశాలను పాటించాలన్నారు. దీనిపై పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రెండెసివిర్ ఇంజెక్షన్కు రూ.2,500కు మించి వసూలు చేయకూడదని... అంతకుమించి వసూలు చేసే ఆస్పత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.అలాంటి ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి తప్పిస్తామన్నారు.