TTD: తిరుమల అన్నప్రసాదాలపై తప్పుడు ప్రచారం, వైరల్ వార్తపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైయ్యింది. గతంలో తిరుమల విషయంలో భక్తులు పలు ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నెల రోజుల క్రితం వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద, అప్పటి టీటీడీ ఛైర్మన్ తో పాటు టీటీడీ అధికారుల తీరుపై శ్రీవారి భక్తులు అనేక ఆరోపణలు చేశారు.
ఇప్పుడు టీటీడీకి జే. శ్యామలరావును ఈవోగా నియమిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .ఇప్పటికే టీటీడీ ఈవోగా జే. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జే. శ్యామలరావు టీటీడీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇప్పటికే లడ్డూ కౌంటర్లకు వెళ్లి శ్రీవారి భక్తుల నుంచి సమాచారం సేకరించారు. తిరుమలలో అన్నదానం కాంప్లెక్స్ కు వెళ్లి భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ టీటీడీ ఈవో జే. శ్యామలరావు వివరాలు తెలుసుకున్నారు.

తిరుమలలో అన్నదాన ప్రసాదాల నాణత్య గురించి, రుచి శుభ్రత గురించి శ్రీవెంకటేశ్వరస్వామి భక్తుల నుంచి వివరాలు తెలుసుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది.
ఇది పూర్తిగా అసత్యం అని టీటీడీ బుధవారం తెలిపింది.
టీటీడీ ఈవో జే శ్యామల రావు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని, అంతేతప్ప వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదం అందించాలని చర్చలు జరుగుతున్నాయని టీటీడీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ పుకార్లు సృష్టిస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవం అని, ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ మీద కక్షకట్టుకున్న కొంత మంది కావాలనే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వైరల్ చేసి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని శ్రీవారి భక్తులు కూడా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications