కిరాతకులు: యువతిపై గ్యాంగ్రేప్ చేసి హత్య, మర్మాంగాలపై యాసిడ్ దాడి
కృష్ణా: జిల్లా చందర్లపాటు మండలంలోని విభరింతలపాడు గ్రామ సమీపంలోని పొలాల్లో ఓ బాలిక అత్యంత పాశవికంగా హత్యకు గురైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరు గ్రామానికి చెందిన రేపాకుల శ్రావణి (16) ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటకు వెళ్లి సాయంత్రమైనా రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు.
సోమవారం విభరింతలపాడు వెళ్లే రోడ్డు వెంబడి సపోట, సుబాబుల్ తోటల్లో వెతుకులాడుతుండగా విభరింతలపాడు గ్రామానికి చెందిన పలువురు పొలాల్లో మద్యం సేవిస్తూ కనపడ్డారు. అనుమానంతో వీరిని ప్రశ్నించగా వారిలో ఒకడు భయంతో జరిగిన విషయాన్ని తెలియజేశాడు.

పొలాల్లో చెట్టుకు వేలాడదీసిన బాలిక మృతదేహాం వద్దకు తీసుకెళ్లి చూపించాడు. చెట్టుకు వేలాడుతున్న కూతురి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. బాలికను మూకుమ్మడిగా అత్యాచారం చేసి కిరాతంగా చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
కాగా, శ్రావణిపై లైంగికదాడి చేయడంతోపాటు గుర్తుపట్టకుండా నోట్లో, మర్మావయాలపై యాసిడ్ పోసిన ఆనవాళ్లు కనిపించాయి. తర్వాత చున్నీతో పత్తిచేలోని వేపచెట్టుకు ఉరివేసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే మృతదేహాన్ని వేప చెట్టుకు వేలాడదీశారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నందిగామ సీఐ సత్యకిషోర్, చందర్లపాడు ఎస్సై కె.దుర్గాప్రసాదరావులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. విభరింతలపాడుకు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications