యువతి అనుమానాస్పద మృతి: గొంతుపై కత్తిగాట్లు, హత్యనా?
నెల్లూరు: నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో రైలు కింద పడి మరణించింది. మరణించిన యువతిని నెల్లూరులోని బాలాజీనగర్ గౌడ హాస్టల్ సెంటర్కు చెందిన జి. మేరీ (24)గా గుర్తించారు. ఆమె మెడపై కత్తి గాట్లు ఉన్నాయి.
దీంతో ఆమెను ఎవరైనా చంపి రైల్వే ట్రాక్పై పడేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నీటి గుంటలో పడి బాలుడి మృతి
భారీ వర్షాలకు చెరువులను తలపించే విధంగా నీరు నిలిచిపోవడంతో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషాదకరమైన సంఘటన నెల్లూరు జిల్లాలోని పెల్లకూరు మండలం చెంటేడు గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
గ్రామంలో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న నీటి గుంటలో పడిపోయాడు. దీంతో ఊపిరి ఆడక మరణించాడు.
దొంగ పట్టివేత
వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలో పలు చోరీలకు పాల్పడిన సయ్యద్ మహబూబ్ బాషా (22) అనే దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మూడున్నర లక్షల విలువైన 12 తులాల బంగారం, 4 పట్టుచీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపే కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.