దారుణం: కూతురుపై పలుమార్లు తండ్రి అత్యాచారం, గర్భం దాల్చిన యువతి
తూర్పుగోదావరి: జిల్లాలోని అంబాజీపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే సొంత కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అంబాజీపేటలోని నెల్లివారిపేటకు చెందిన చింతపల్లి వెంకటేశ్వరరావు తన 9వ తరగతి చదువుతున్న కూతురి(17)పై మద్యం మత్తులో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం బాలికకు వాంతులయ్యాయి. స్థానిక మహిళలకు అనుమానం వచ్చి బాలికకు వైద్యపరీక్షలు చేయించారు.
కాగా, బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు ధృవీకరించడంతో బాలిక మామయ్య గోవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబాజీపేట పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తల్లి త్రివేణి ఉపాధి నిమిత్తం రెండెళ్ల క్రితం కువైట్ వెళ్లింది.
కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అన్నారు. ఇరుసుమండలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కామాంధుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠినంగా శిక్షించేలా కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. ఘటనపై మహిళా సంఘాలు కూడా మండిపడ్డాయి.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి మృతి
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి వద్ద ట్రాక్టర్ ఢీకొని వెంకటేశ్(12) అనే విద్యార్థి మృతి చెందాడు. గోకవరం ఎస్సై శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. టి వెంకటేశ్ గోకవరం ఎస్సీ బాలుర వసతిగృహంలో ఆరో తరగతి చదువుకున్నాడు.
క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లిన వెంకటేష్.. బుధవారం ఉదయం ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై హాస్టల్కు వస్తుండగా కొత్తపల్లి శివారులో ఇసుక ట్రాక్టర్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.