దారుణం: మైనర్ బాలికపై 5నెలలుగా లైంగిక దాడి
తూర్పుగోదావరి: ఓ మైనర్ బాలికపై ఐదు నెలలుగా లైంగిక దాడికి పాల్పతున్న వృద్ధున్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామేశ్వరం గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ కూలీకి మానసిక పరిపక్వత లేని ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన భార్య ఇటీవలే చనిపోయింది. తండ్రీ కొడుకులు వ్యవసాయ పనులకు వెళుతుండగా మైనర్ బాలిక ఒంటిరిగా ఇంట్లోనే ఉంటోంది.
దీన్ని ఆసరాగా చేసుకున్న అదే గ్రామానికి చెందిన నారదాసు రాము(50) బాలికను మాయమాటలతో లోబర్చుని సుమారు ఐదు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీయగా విషయం బయటపడింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతని డాక్టర్లు ధ్రువీకరించారు. నిందితున్ని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
రైలు కింద పడి వృద్ధురాలు మృతి
గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలంలోని పాలువాయి గేటు గ్రామం వద్ద శనివారం రైలు కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. పాలువాయి గేటు గ్రామంలో కొంతకాలంగా భిక్షాటనం చేసుకుంటూ జీవిస్తున్న అంకమ్మ(70) బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా గుంటూరు నుంచి మాచర్ల వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు కిందపడి మృతిచెందింది. ఈమెకు కుటుంబసభ్యులు,బంధువులు ఎవరూ లేరని గ్రామస్తులు తెలిపారు.
తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు
అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులపై కిరోసిన్పోసి నిప్పంటించాడు. విషయం గమనించిన స్థానికులు ఆ దంపతులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.