ఓవైపు కరోనా లాక్ డౌన్.. కానీ ఆ స్కూల్లో మాత్రం రహస్యంగా క్లాసులు..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల తీరు మాత్రం మారడం లేదు. ఓవైపు కరోనా అలజడికి ప్రాణభయంతో వణికిపోతుంటే.. దానికంటే ర్యాంకుల సాధనే తమకు ముఖ్యమన్నట్టుగా కొన్ని విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని తూర్పు వడ్డెపాలెంలోని నారాయణ స్కూల్ యాజమాన్యం రహస్యంగా క్లాసులు నిర్వహిస్తున్న ఘటన బయటపడింది.
పట్టణంలోని ఓ కాలనీలో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకున్న స్కూల్ యాజమాన్యం అందులో పదో తరగతి విద్యార్థినులకు రహస్యంగా క్లాసులు నిర్వహిస్తోంది. దీనిపై కొంతమంది వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కందుకూరు పట్టణ ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకుని టీచింగ్ స్టాఫ్ను పోలీస్ స్టేషన్కు తరలించి.. విద్యార్థినులను ఇళ్లకు పంపించారు. నారాయణ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రెండు వారాల పాటూ వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మార్చి 31 తర్వాత రీ షెడ్యూల్ ఉంటుందని ప్రకటించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించాల్సి ఉంది. పరీక్షలకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలోనే కరోనా మహమ్మారి తరుముకురావడంతో పరీక్షలు వాయిదా వేయక తప్పలేదు.