బిజెపి,వైసిపిల మధ్య రహస్య ఒప్పందం: చినరాజప్ప సంచలన ఆరోపణలు...
విజయవాడ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదనపై వివిధ పార్టీల ప్రతిస్పందన నేపధ్యంలో ఎపి డిప్యూటీ సిఎం చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బిజెపి,వైసిపి మధ్య రహస్య ఒప్పందాలు ఉండొచ్చని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.లేకపోతే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్న జగన్ వ్యాఖ్యలపై బిజెపి నాయకులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Recommended Video

మరోవైపు ప్రతిపక్షనేత జగన్ మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదని చినరాజప్ప ఎద్దేవా చేశారు. మరి లేకుంటే రాష్ట్రానికి అన్యాయంపై మూడేళ్లుగా సైలెంట్ గా ఉండిపోయిన వైకాపా ఎంపీలు ఇప్పుడు రాజీనామా డ్రామాలకు తెరతీయడం ఏమిటని ప్రశ్నించారు. సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు రాజకీయంగా లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో టిడిపి చిక్కుకొందని బిజెపి నేతలు విశ్లేషిస్తున్నారు.

భాజాపాతో...ఇప్పటికీ మిత్ర ధర్మమే...
తామైతే బిజెపితో ఇప్పటికీ మిత్ర ధర్మాన్నే పాటిస్తున్నామని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పుకునేందుకు ఆ పార్టీ మంత్రుల రాజీనామాలు చేసే విషయం మాత్రం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఏదేమైనా బిజెపితో వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే తమకు శిరోధార్యమని చినరాజప్ప స్పష్టం చేశారు. నిధుల కేటాయింపుల్లో భాజపా నేతలు వాస్తవాలు మాట్లాడాలని చినరాజప్ప సూచించారు.

అవమానించినా భరించాం:టిడిపి ఎమ్మెల్యే అనిత
బిజెపి తమను ఎంత అవమానించినా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే భరించామని టిడిపి ఎమ్మెల్యే అనిత చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చిందో పార్టీలను పక్కనపెట్టి బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

హామీలు నెరవేర్చకపోతే...కటీఫే: మంత్రి ఆదినారాయణ
బిజెపి గురించి మంత్రి ఆదినారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలోని 19 అంశాలపై తెదేపా ఇచ్చిన గడువు మార్చి 6 లోపు బిజెపి తమ నిర్ణయం వెలల్లడించకపోతే ఆ పార్టీతో స్నేహానికి ముగింపు పలకాల్సివస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల కుట్రలో చిక్కుకున్న టిడిపి:బిజెపి
మరోవైపు టిడిపి నేతలు తమ పార్టీపై చేస్తున్న విమర్శలను బిజెపి నేతలు తిప్పికొడుతున్నారు. టిడిపి-బిజెపి మధ్య మిత్రబంధం ఉంటుందో...ఉండదో అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని బిజెపి అధికార ప్రతినిధి రాంభొట్ల సుధీష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ద్వారా తాము లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో టిడిపి ఇరుక్కుందని ఆయన విశ్లేషించారు. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వెంటనే గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆయన సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications