ప్రాణం తీసిన ర్యాగింగ్ భూతం: ఇంటికొచ్చి నిప్పంటించుకున్నాడు
తూర్పుగోదావరి: ర్యాగింగ్పై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అది విద్యాలయాలకు వచ్చే నూతన విద్యార్థుల పాలిట మృత్యుపాశంలానే ఉంటోంది. ఓ ఆశ్రమ పాఠశాలలో విద్యనభ్యసించేందుకు వచ్చిన ఓ విద్యార్థిపై మరికొందరు విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడటంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని తోటపల్లిలో చోటు చేసుకుంది.
పోలీసులు, మృతుడి తోటి విద్యార్థుల తెలిపిన వివరాల ప్రకారం.. తోటపల్లి పంచాయతీ కుసుమనపల్లి గ్రామానికి చెందిన సున్నం బుచ్చిబాబు, నాగమణి దంపతుల కుమారుడు సున్నం బన్నీ (12). కొత్తూరు నారాయణపురం ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలోని ఉన్నత తరగతి విద్యార్థులు బన్నీని ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేసేవారు. ఎక్కడ కనిపించినా ఎగతాళిగా మాట్లాడేవారు.
ఆ విషయం క్లాసు టీచర్లకు చెప్పినా.. సరైన రీతిలో స్పందించలేదు. హాస్టల్ వార్డెన్ కూడా పట్టించుకోలేదు. హెడ్మాస్టర్ను కలిసి గోడు చెప్పుకున్నా బన్నీకి రక్షణ లభించలేదు. ఈ స్థితిలో చదువుపై దృష్టి పెట్టలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు బన్నీ.
ఈ నేపత్యంలో శనివారం చెప్పాపెట్టకుండా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. సరాసరి వంటింట్లోకి వెళ్లిన.. క్షిణికావేశంలో కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకొన్నాడు.
మంటల్లో కాలిపోతూ కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై బన్నీని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడనుంచి వరంగల్కు తీసుకెళుతుండగానే బన్నీ తుదిశ్వాస విడిచాడు.. పాఠశాలలో విద్యార్థులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు విచారణాధికారిగా చింతూరు ఏపీవో వెంకటేశ్వరరావును నియమించినట్లు ఐటీడీఏ పీవో ఇనచార్జి రవిపట్టనశెట్టి తెలిపారు. బన్నీ మరణంతో అతని కుటుంబంతోపాటు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే బన్నీ ఆత్మహత్య చేసుకున్నాడని బన్నీ కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. విద్యార్థి ఆత్మహత్యకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, గ్రామస్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.