ప్రేమించి పెళ్ళాడి రెండేళ్లకే ముఖం చాటేసిన భర్త; న్యాయం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భార్య ధర్నా
ప్రేమించి పెళ్లాడిన భర్త, జీవితాంతం అండగా ఉంటాడు అనుకుంటే పెళ్ళయిన రెండేళ్ళకే భార్యను వదిలి పెట్టి వెళ్లిపోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అత్తమామల మాట విని, భర్తను విడిచి పెట్టి వెళ్ళాడు అని తెలుసుకున్న భార్య తనకు న్యాయం కావాలంటూ అత్తగారి ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
కులాంతర వివాహమే శాపమా..కోడలిపై అత్తమామల దాష్టీకం...చంటి బిడ్డతో సహా..!!
తన భర్త తనకు కావాలంటూ భార్య ఆందోళన
పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో తన భర్త తనకు కావాలి అంటూ భర్త ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేసింది భార్య శ్రీదేవి. పెళ్లయిన రెండేళ్లకే భర్త పూరెళ్ళ ప్రవీణ్ కుమార్ ముఖం చాటేయడంతో తనకు న్యాయం చేయాలంటూ , భర్త ఇంటికి వెళ్ళిన శ్రీదేవిని భర్త మరియు అత్తమామలు చితకబాదారు. ఆమెను వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు.
ప్రేమ పెళ్లి చేసుకుని ఆపై భార్యను వదిలేసిన భర్త, భార్య ధర్నా
పూర్తి వివరాల్లోకి వెళితే నల్లజర్ల కు చెందిన శ్రీదేవి దూబచర్ల కు చెందిన ప్రవీణ్ కుమార్ రెండేళ్ళ క్రితం ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదు. దీంతో సమీప గ్రామమైన జగన్నాధపురం లో వీరు వేరు కాపురం పెట్టారు. సంవత్సరకాలం పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. అవి కాస్త పెద్దదిగా మారి ప్రవీణ్ శ్రీదేవిని వదిలి పెట్టి ఎటో వెళ్లి పోయాడు. అయితే పారిపోయినట్లుగా భావించిన ప్రవీణ్ ... తన తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉంటున్నాడు అని తెలుసుకుని శ్రీదేవి అక్కడకు చేరుకోగా తమ ఇంటి ముందు నుంచి వెళ్లిపోవాలంటూ అత్తమామలు దుర్భాషలాడి శ్రీదేవిని చితకబాదారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి వద్ద బైఠాయించి శ్రీదేవి ధర్నాకు దిగింది.
తమ కాపురాన్ని విడదీసింది అత్తమామలే అంటూ మహిళ ఆరోపణ
ప్రవీణ్ తల్లి తండ్రులు తమ కాపురాన్ని విడదీశారు అని 10 లక్షలు ఇచ్చి తమ కుమారుణ్ణి వదిలేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. మరో పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం వస్తుందని, తమ అత్తమామలు భర్త ప్రవీణ్కు ఆశ చూపుతున్నారని శ్రీదేవి పేర్కొంది. అత్తమామలు 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పేర్కొంటూ భర్త ప్రవీణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది.శ్రీదేవి లాగా ఎంతోమంది మహిళలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత నానా అగచాట్లు పడుతున్నారు. చాలా మంది ఇలాగే ఇబ్బంది పడుతూ దిక్కు తోచని స్థితిలో ఆందోళనల బాట పడుతున్నారు.
మహిళల కోసం ఎన్ని చట్టాలున్నా వేధింపులు నిత్య కృత్యమే
మొన్నటికి మొన్న చంటి బిడ్డతో ఒక మహిళ కులాంతర వివాహం చేసుకున్న కారణంగా అత్తమామల వేధింపులతో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగగా, ఇప్పుడు శ్రీదేవి తనకు న్యాయం కావాలని ఆందోళన చేస్తుంది. మహిళల రక్షణ కోసం గృహ హింస చట్టాలు ఎన్ని వచ్చినా, వేధింపులకు గురి కాకుండా కఠిన చట్టాలు తెచ్చినా సరే సమాజంలో నేటికీ మహిళలు గృహ హింసకు గురవుతూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా అత్తమామల వేధింపులకు బలైపోతూనే ఉన్నారు. జీవితాంతం అండగా ఉండాల్సిన భర్త మోసం చేస్తే, వదిలించుకునే ప్రయత్నం చేస్తే లబోదిబోమని రోదిస్తూనే ఉన్నారు.