లోకేష్ గురించి రేవంత్కి ప్రశ్న: మరో 20మంది, బాబు పేరు ఉంటుందా?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డిని శని, ఆది, సోమవారాల్లో (మూడు రోజులు) ఏసీబీ అధికారులు వందల ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ఇందులో 'బాస్' వ్యవహారంపై ప్రధానంగా దృష్టి సారించారని తెలుస్తోంది.
చంద్రబాబును పేరును ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకున్నారని అధికారులు అడగ్గా.. ఫోన్లో మీ వద్దే ఉందని సమాధానం చెప్పారని తెలుస్తోంది. అధికారులు నారా లోకేష్ను ఏమని పిలుస్తారని అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. సందర్భాన్ని బట్టి పిలుస్తానని చెప్పారని సమాచారం.
సోమవారం నాడు 80 నుండి 90 ప్రశ్నలు అడిగారని రేవంత్ తరఫు న్యాయవాదులు చెప్పారు. మరోవైపు, రేవంత్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి ఇంట్లో ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్, సీపీయూలను స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ కుటుంబం సమక్షంలో సోదాలు జరిపారు.
కాగా, రేవంత్ పాస్ పోర్టు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, రేవంత్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకోలేదని, ఆయన విచారణకు సహకరిస్తున్నారని ఏసీబీ డీఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు.
ఓటుకు నోటు కేసులో 20మంది పేర్లు?
ఓటుకు నోటు వ్యవహారంలో కొత్తగా మరో 20 మంది పేర్లు బయటకు వచ్చే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కోర్టుకు సమర్పించే కేసు డైరీలో ఏసీబీ వర్గాలు ఈ 20 పేర్లను ప్రస్తావించవచ్చునని అంటున్నారు.
ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితులను విచారించిన సందర్భంగా, ఆ విచారణలో వచ్చిన పేర్లను ఈ డైరీలో చేరుస్తారంటున్నారు. చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో టేపుల్లో ఉండటంతో ఆయన పేరు కూడా చేర్చుతారా అనే చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుసుకుంటోందా అనే చర్చ సాగుతోంది.
ఏసీబీ తాము సంపాదించిన ఆధారాలతో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. తమకు లభించిన సమాచారం ఆధారంగా అందులో మరికొంతమందికి నోటీసులు ఇస్తారనిచెబుతున్నారు. అందులో చంద్రబాబు పేరు ఉండే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నోటీసుల విషయంలో ఏసీబీ న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది.