ఏపీ సచివాలయంలో భారీ స్కామ్ : ప్రజా ప్రతినిధుల సిబ్బంది పాత్ర : ఏసీబీ అదుపులో అనుమానితులు..!!
ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న భారీ స్కామ్ ను ఏసీబీ గుట్టు రట్టు చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధుల గోల్ మాల్ జరిగినట్లుగా విచారణలో గుర్తించారు. సచివాలయంలోనే పని చేసే కొందరు సిబ్బంది పేదల డేటా సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధులు పక్క దారి పట్టించారని నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో సచివాలయ సిబ్బందితో పాటుగా ప్రజా ప్రతినిధులు పీఏలు .. వారి అనుచరుల పాత్ర పైనా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే సీఎంఆర్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేసారు.
దీంతో..రంగంలోకి దిగిన ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేసింది. నకిలీ బిల్లులను క్రియేట్ చేసి వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తేల్చారు. ఈ వ్యవహారం లో దాదాపు 50 మంది వరకు ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది మే నుంచి ఏసీబీ ఈ వ్యవహారం పైన విచారణ ప్రారంభించింది. ఇప్పటికే పలువురు అధికారులు..సిబ్బందిని విచారించారు. అయితే, మరి కొందరు విచారణకు పిలిచినా హాజరు కాలేదు. విడతల వారీగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి ఇప్పుడు ఏసీబీ మరో సారి నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఇద్దరు కీలక సిబ్బందిని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కానీ, ఏసీబీ లేదా ప్రభుత్వం నుంచి మాత్రం సిబ్బందిని అదుపులోకి తీసుకున్న అంశం పైన అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయితే, ఈ మొత్తం వ్యహారంలో కొందరు ప్రజా ప్రతినిధుల వద్ద పని చేసే సిబ్బంది ప్రమేయం సైతం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, వారెవరనేది మాత్రం పేర్లు బయటకు రాలేదు. గతంలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే వద్ద పని చేసే సిబ్బంది పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఇక, ఇప్పుడు సచివాలయంలోనే పని చేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును పక్క దారి పట్టించిన ఇంటి దొంగల పైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఏసీబీ కీలక ఆధారాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ అంశం సచివాలయం అధికారిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని వెనుక ఉన్నదెవరు...ఎవరి సహకారంతో జరిగింది.. ఇందులో పాత్ర ధారులు ఎవరనే అంశం పైన ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.