ఆధారాలు దొరికాయా?: రేవంత్ పాస్పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్!
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పాస్పోర్టు, బ్యాంక్ పాస్ బుక్ను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉదయం రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆధారాలు దొరికాయా?
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి పైన బలమైన ఆధారాలు లభించడం వల్లే పాస్ పోర్ట్ సీజ్, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారా అంటే అవుననే అంటున్నారు. బ్యాంక్ ఖాతాలు సీజ్ చేయాలంటే ఆ ఖాతాల ద్వారా జరిగిన ల్వాదేవీలో అవకతవకలు జరిగాయని ఆధారాలుండాలి. ఆ వ్యక్తి విచారణను తప్పించుకొని విదేశాలకు పారిపోయే అవకాశముందని అనుమానం వస్తే పాస్ పోర్ట్ సీజ్ చేస్తారు.
చంద్రబాబు తన సంభాషణను పరోక్షంగా ఒప్పుకున్నారు
చంద్రబాబు తన సంభాషణను పరోక్షంగా ఒప్పుకున్నారని తెరాస ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. పరకాల ప్రభాకర్ ఆ స్వరం చంద్రబాబుది కాదంటున్నారని, ఘటనపై కేసు నమోదు చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపవచ్చన్నారు.
ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన గత్యంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం న్యాయబద్దంగా పని చేస్తోందని చెప్పారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు.
ఒత్తిడికి గురవుతున్న రేవంత్ రెడ్డి
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలకు మంగళవారం ఉదయం ఉస్మానియా ఆశుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
రేవంత్ రెడ్డి ఒత్తిడికి గురవుతున్నారని, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం రేవంత్ రెడ్డిని బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఉదయ్ సిన్హా ఆరోగ్యం బాగాలేదని, మరిన్ని వైద్య పరీక్షలు చేస్తామన్నారు. వైద్య పరీక్షల తర్వాత ఏ చికిత్స ఇవ్వాలో పరిశీలిస్తామన్నారు.