అక్కినేనిపై బాబు, కృష్ణంరాజు: బాబు, ఏడ్చిన జయసుధ
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వర రావు తనను చాలా లైక్ చేసేవారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అక్కినేని మృతదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అక్కినేని మృతి తనకు బాధ కలిగించిందని, జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు.
తాను రాజకీయాల్లోకి వచ్చాక అక్కినేనితో పరిచయమైందన్నారు. మంచి నటులు, మంచి వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్, అక్కినేనిలు పరిశ్రమకు రెండు కళ్లవంటివారన్నారు. ఇద్దరు పోటీ పడ్డారు... కలిసి పని చేశారన్నారు. సినిమా అంటే వీరిద్దరే గుర్తుకు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. నాగార్జునను చంద్రబాబు పరామర్శించారు.
సొంతిల్లు వదిలి: కాసు
హైదరాబాదుకు తెలుగు సినీ పరిశ్రమను తీసుకు వచ్చేందుకు అక్కినేని తమిళనాడులో సొంతిల్లు వదులుకొని వచ్చి హైదరాబాదులో కిరాయికి తీసుకున్నారన్నారు.
ప్రతిభావంతులు: కావూరి
అక్కినేని ప్రతిభావంతులని, ఆయనకు తన ప్రగాఢ సానుభూతి అని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు అన్నారు.
స్పోర్టివ్గా తీసుకున్నారు: ఉండవల్లి
అక్కినేని తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పటికీ దానిని స్పోర్టివ్గా తీసుకున్నారన్నారు.
పెద్ద దిక్కు, సలహాలిచ్చేవారు: సుమన్, రాజశేఖర్
తాము సలహాలు అడిగితే వెంటనే ఇచ్చేవారని ప్రముఖ నటులు సుమన్ అన్నారు. పరిశ్రమలో పెద్ద దిక్కును కోల్పోయామని రాజశేఖర్ చెప్పారు. అతనిని తామంతా మిస్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పోటీ పడే వారు లేరు: కృష్ణం రాజు
అక్కినేనితో పోడీ పడేందుకు ఎవరూలేరని నటుడు కృష్ణం రాజు అన్నారు. ఆయనకు ఏమీ కోరికలు లేవని, అన్నీ తీరాయని, మహానుభావుడన్నారు. ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. పరిశ్రమలోకి రాకముందు ఆయనను తాను అభిమానించేవాడినని, పరిశ్రమలోకి వచ్చాక ఆప్యాయంగా పలకరించేవారన్నారు.
స్ఫూర్తి ప్రదాత: గీతా రెడ్డి
అక్కినేని స్ఫూర్తి ప్రదాత అని, ఆత్మీయ బంధువు అని మంత్రి గీతా రెడ్డి చెప్పారు. వారు చిరస్మరణీయులని, ఆజాత శత్రువు అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లా అక్కినేనికి ఘాట్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు.
పురంధేశ్వరి: దిగ్భ్రాంతి
అక్కినేని మృతి తనకు దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి పురంధేశ్వరి అన్నారు. వ్యక్తిగతంగా తాను, తన కుటుంబ సభ్యులం పెద్ద దిక్కు కోల్పోయామన్నారు. ఎన్టీఆర్, ఎఎన్నార్ల మధ్య బాంధవ్యం ఉందన్నారు.
అక్కినేని భౌతికాయానికి పలువురు సిని, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రజా గాయకులు గద్దర్, టిటిడిపి నేత ఎర్రబెల్లి, మంత్రి జానా రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు కూడా నివాళులు అర్పించారు. అక్కినేని మృతదేహాన్ని చూసి నటి, సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ కన్నీరుమున్నీరయ్యారు. హీరోయన్ అనుష్క కన్నీటిపర్యంతమయ్యారు.