అదొక్కటి తప్ప: జగన్ పాదయాత్రపై ఆదినారాయణ జోస్యం, పోలికెక్కడిదని కేఈ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై మంత్రి ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై మంత్రి ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు.
కాళ్ల నొప్పులు తెచ్చుకునేందుకే వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని, జగన్ యాత్ర వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. మూడు వేలు కాదు 30 వేల కిలోమీటర్లు నడిచినా వైసిపి ఉండదని జోస్యం చెప్పారు.
జగన్ పాదయాత్రపై టిడిపి విసుర్లు
ఏపీలో నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఆయన పాదయాత్ర ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. పాదయాత్ర ఏర్పాట్లపై వైసిపి నేతలు పలుమార్లు సమావేశమయ్యారు. ఈ యాత్రపై టిడిపి నేతలు విసుర్లు విసురుతున్నారు.
బాబు శ్రమ, జగన్ పనితీరుకు పోలిక ఉందా
జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ముఖ్యమంత్రి కాలేరని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమిస్తున్న తీరుకు, జగన్ పనితీరుకు పోలిక ఉందా? అని ప్రశ్నించారు.
వైసిపి మనుగడ రోజురోజుకు తగ్గుతోంది
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా చంద్రబాబు పని చేస్తున్నారని కేఈ అన్నారు. నిరంతర శ్రామికుడైన చంద్రబాబు పనితీరుతో టిడిపికి ప్రజాదరణ పెరుగుతోందని, జగన్ పనితీరుతో వైసిపి మనుగడ రోజురోజుకు తగ్గుతోందన్నారు.
సీఎం పదవి కోసమే పాదయాత్ర
ముఖ్యమంత్రి పదవికోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. జగన్ కుళ్లు కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఐఏఎస్లను కూడా గన్ కోర్టు మెట్లు ఎక్కించారన్నారు. తండ్రి పదవిని అడ్డు పెట్టుకొని అరాచకాలకు పాల్పడ్డారన్నారు. జగన్ మాటలు, యాత్రలు కేవలం సీఎం ఉద్యోగం కోసమే అన్నారు. ఆ తపన తప్పితే మరో ఆలోచన లేదన్నారు.