అంబటి సవాల్, బుద్ధా వెంకన్న ప్రతి సవాల్: సత్తెనపల్లిలో ఉద్రిక్తత, రాంబాబు హౌస్ అరెస్ట్
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందరికీ పింఛన్లు ఇవ్వడం లేదని, అలా ఇచ్చారని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు సవాల్ చేశారు.
అంబటి రాంబాబు సవాల్ను తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్వీకరించారు. అందరికీ పింఛన్లు వస్తున్నాయని నిరూపించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇందుకోసం సత్తెనమపల్లి సెంటర్లో చర్చకు సిద్ధం కావాలని చెప్పారు.

అంబటి హౌస్ అరెస్ట్
అంబటి, బుద్ధా వెంకన్నల సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అంబటి రాంబాబు చర్చా వేదిక వద్దకు బయలుదేరగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని, హౌస్ అరెస్ట్ చేశారు.

సవాల్, ప్రతి సవాల్
ఇటీవల ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో అంబటి మాట్లాడుతూ.. పింఛన్లలో అక్రమాలు ఉన్నాయని చెప్పారు. దీనిని బుద్ధా తప్పుబట్టారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పారు. అందుకు తానూ సిద్ధమని అంబటి అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి సెంటర్లో చర్చకు రావాలని అనుకున్నారు.

అంబటి వస్తుండగా అడ్డుకొని
అయితే అంబటి వస్తుండగా పోలీసులు అడ్డుకొని, హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు, బుద్ధా వెంకన్న విజయవాడ నుంచి సత్తెనపల్లి బయలుదేరారు. అభివృద్ధిపై చర్చకు భయపడి అధికార పార్టీ అరెస్టు చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది.

దమ్ముంటే ఇప్పటికైనా రావాలి
పింఛన్లలో అక్రమాలు లేవని, అభివృద్ధిపై చర్చకు వారు ఎందుకు వెనుకాడుతున్నారని, తనను చర్చా వేదిక వద్దకు వెళ్లకుండా టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుందని, అసలు పోలీసులను పురమాయించి అరెస్టులు చేయించేవాళ్లు సవాలు ఎందుకు చేసినట్లు అని, ఇప్పటికైనా దమ్ముంటే చర్చకు రావాలని, పింఛన్ల విషయంలో ప్రభుత్వం బండారం బయటపెడతానని అంబటి అన్నారు.












Click it and Unblock the Notifications