మూడు రాజధానులపై ఆవిరవుతున్న ఆశలు ! .. మండలి రద్దు తప్పనిసరి... జగన్ సర్కార్ కిం కర్తవ్యం ?
ఏపీలో అధికార వికేంద్రీకరణలో భాగంగా రాజధానుల తరలింపు కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా విఘాతం కలుగుతోంది. అనుమతి లేకుండా అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే అందుకయ్యే ఖర్చును అధికారుల నుంచే వసూలు చేస్తామని గతంలోనే హెచ్చరించిన హైకోర్టు.. తాజాగా కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం ఇక మండలి రద్దుపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్ధితి.

మూడు రాజధానులయ్యేనా...
ఏపీలో అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించగా, సెలక్ట్ కమిటీ పేరుత మండలి పక్కనబెట్టేసింది. దీంతో సీఎం జగన్.. మండలి రద్దుకోసం అసెంబ్లీ తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. అయితే అంతటితో పని పూర్తి కాలేదు. ఓ కార్యనిర్వాహక ఉత్తర్వుతో రాజధాని తరలించుకోవచ్చన్న న్యాయనిపుణుల సూచన మేరకు జగన్ సర్కారు కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దాన్ని హైకోర్టు తిరస్కరించడంతో పరిస్దితి మళ్లీ మొదటికొచ్చింది.

ఓవైపు తరలింపు ప్రయత్నాలు...
రాజధాని తరలింపు విషయంలో తమ ప్రభుత్వానికి న్యాయస్ధానాల్లో చుక్కెదురు అవుతున్నా... సీఎం జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాస్తవానికి కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుకు ముందే హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కానీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లింది. కానీ చివరికి చుక్కెదురు కాక తప్పలేదు. అదే సమయంలో విశాఖకు ఉద్యోగులను తరలించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతోంది. మే 31లో గా ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఇప్పటికే అధికారికంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగులకు ఈ మేరకు హామీలు కూడా ఇచ్చేశారు..

మండలి రద్దుపైనే జగన్ ఆశలు...
రాజధాని తరలింపు కోసం న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్న తరుణంలో చట్టపరమైన ప్రక్రియనే నమ్ముుకోవాల్సిన పరిస్దితి ప్రభుత్వానికి ఎదురవుతోంది. ఇందులో మండలి రద్దు కోసం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదన పంపినందున దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తక్షణం కేంద్రంతో సంప్రదింపులు ప్రారంభించడమే మేలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా ఢిల్లీలో ఉన్న ఎంపీలను కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ ప్రారంభించాలని జగన్ సూచించనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 3తో ముగియనున్న నేపథ్యంలో అ లోపు మండలి రద్దుకు పార్లమెంటు ఆమోదం తీసుకోవడం జగన్ ప్రభుత్వానికి కీలకంగా మారింది.
Recommended Video

అదీ కుదరకపోతే... చివరిగా..
రాజధాని బిల్లులను ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన నేపథ్యంలో మండలి రద్దు పూర్తయితే ఓకే.. కానీ ఏ కారణం వల్లనైనా పార్లమెంటు దీని ఆమోదాన్ని వాయిదా వేస్తే మాత్రం జగన్ ప్రభుత్వానికి ఆర్డినెన్స్ జారీ ఒక్కటే చివరి అస్త్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత అసెంబ్లీ ప్రోరోగ్ చేసి ఆ తర్వాత రాజధాని తరలింపు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తే బావుటుంందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఈసారి కచ్చితంగా మండలి రద్దుకు పార్లమెంటు ఆమోదం లభిస్తుందని, అలా కుదరకపోతే మాత్రం ఆర్డినెన్సే మార్గంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.












Click it and Unblock the Notifications