చంద్రబాబు సభల్లో తొక్కిసలాటతో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం- రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కందుకూరు, గుంటూరుల్లో రోడ్ షో, బహిరంగ సభల్లో తొక్కిసలాట అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

కందుకూరు, గుంటూరు ఘటనలతో..
డిసెంబర్ 28వ తేదీన కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన సంభవించిన సరిగ్గా మూడు రోజుల్లోనే గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ అదే పరిస్థితి తలెత్తింది. చంద్రన్న కానుకల పంపిణీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మరో ముగ్గురు మహిళలు ప్రాణాలను కోల్పోయారు.

కీలక ఉత్తర్వులు..
ఈ రెండు సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రోడ్లపై బహిరంగ సభలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించింది. ర్యాలీలను చేపట్టడంపైనా ఉక్కుపాదం మోపింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

నిషేధించిన ప్రదేశాలివే..
జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న రోడ్లపై బహిరంగ సభలు గానీ, ర్యాలీలను గానీ నిర్వహించడాన్ని నిషేధించింది హోం మంత్రిత్వ శాఖ. మున్సిపాలిటీల ఆధీనంలో ఉన్న రోడ్లను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది. పంచాయతీ రాజ్ రహదారులపైన ఈ ఉత్తర్వులు అమలవుతాయని స్పష్టం చేసింది. ఇరుకు రోడ్లు, సందుల్లో సభలను నిర్వహించడానికి, ర్యాలీలను చేపట్టడానికి అనుమతి లేదని వివరించింది.

ఆ వెసలుబాటు..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్ల అనుమతి తీసుకుని అలాంటి ప్రదేశాల్లో బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే వెసలుబాటును కల్పించింది ప్రభుత్వం. అలాంటి సమయంలో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఇచ్చే గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది. సభలు, ర్యాలీలను నిర్వహించే విషయంలో కొత్త మార్గదర్శకాలకు లోబడాల్సి ఉంటుందని నిర్వాహకులను హెచ్చరించింది.

సమయపాలన పాటించాల్సిందే..
బహిరంగ సభలు, ర్యాలీలను నిర్వహించే సమయంలో పోలీసులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వాహకులు సమయ పాలనను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దీనిపైలిఖితపూరక హామీని పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. సభను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనేది స్పష్టం చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సభ ఉంటుందనే విషయాన్నీ పోలీసులు తెలియజేయాలి. ముందుగా సమర్పించిన రూట్ మ్యాప్ కు అనుగుణంగానే ర్యాలీలను చేపట్టాలి.












Click it and Unblock the Notifications