జెడ్పీ పాలకవర్గాలు కొనసాగింపా- ఎన్నికలా : కొత్త జిల్లాలతో ఉత్కంఠ : సీఎం ఆలోచన ఇదేనా..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపైన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాలు..ఇక నుంచి 26 జిల్లాలు కానున్నాయి. పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత అవి అధికారికం కానున్నాయి. ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, ఇప్పడు జిల్లాల స్వరూపాల్లో మార్పులు చేర్పులు జరగటం.. జిల్లాల సంఖ్య పెరగటంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ ల భవిష్యత్ పైన చర్చ మొదలైంది.
Recommended Video
జిల్లా పరిషత్ లు కొనసాగుతాయా
జిల్లాలు మారినప్పుడు జిల్లా పరిషత్ ల సంఖ్య సైతం పెరుగుతుందా.. దీనికి అనుగుణంగా కొత్త జిల్లా పరిషత్ లు ఏర్పాటు చేస్తారా.. ఇందు కోసం మరలా ఎన్నికలు జరగలా..లేక, ప్రస్తుతం ఉన్న వాటికే కొనసాగిస్తారా అనే చర్చ రాజకీయంగా మొదలైంది. రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లా పరిషత్ ల పాలక వర్గాలు 2021, సెప్టెంబర్ లో మొదలైంది. మరో నాలుగున్నారేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. దీని పైన అధికార వర్గాల వాదన భిన్నంగా ఉంది. కొత్త జిల్లాలకు నోటిఫేషన్ జారీ అయినా... అవి జిల్లా పరిషత్ ల పైన ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం సైతం దీని పైన కసరత్తు చేసిన తరువాతనే జిల్లాల పెంపు పైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ మోడల్ అమలు
ఇందు కోసం ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందని చెబుతున్నారు. ప్రస్తుత జిల్లా పరిషత్ ల యధావిధిగా కొనసాగించాలనేదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇందు కోసం తెలంగాణ లో వ్యవహరించిన విధానాన్నే ఇక్కడా కొనసాగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాల విభజన కార్యరూపం దాల్చినప్పటికీ, జెడ్పి చైర్ పర్సన్, వైస్ చైర్మన్లసహా పాలకవర్గాలు ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పంచాయతీరాజ్ నిపుణులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడిన తర్వాత జిల్లాలు లేదా మండలాల విభజన జరిగితే, ఆయా జిల్లాల్లో పాత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాతే కొత్త జిల్లాలకు పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
జెడ్పీల కొనసాగింపుపై క్లారిటీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికే తొమ్మిది జిల్లా పరిషత్లకు 2013లో పాలకవర్గాలు ఏర్పడ్డాయి. టిఆర్ఎస్ పార్టీ కొత్త జిల్లాల హామీతోనే ఎన్నికలకు వెళ్లింది. కొత్త ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో 31 జిల్లాలకు ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిపై నెల రోజులపాటు అభ్యంతరాల స్వీకరించిన అనంతరం, అదే ఏడాది అక్టోబర్ నుంచి ఆ జిల్లాల్లో పరిపాలన ప్రారంభించింది. 31 జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ, తొమ్మిది జిల్లా పరిషత్లనే కొనసాగించారు. వాటి పదవీకాలం పూర్తయిన తర్వాత, కొత్త జిల్లాల వారీగా జెడ్పిటిసి, ఎంపిటిసిలకు ఎన్నికలను నిర్వహించారు. ఏపీలోనూ అదే వైఖరితో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల నాటికి కొత్త వ్యూహాలు
పదవీకాలం పూర్తయ్యేంత వరకు అవి కొనసాగుతాయని ప్రభుత్వంలోని ముఖ్యులు క్లారిటీ ఇస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు కూడా పాత జిల్లాల వారీగానే నిధులు మంజూరవుతాయని తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డిసిసిబి), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు (డిసిఎంఎస్) కూడా పాతవే కొనసాగనున్నాయి. అయితే, 2024 ఎన్నికల తరువాత మాత్రం ఈ కొత్త జిల్లాల్లో రాజకీయంగా కొత్త పదువులు .. పోటీ... ఎన్నికలు మొదలు కానున్నాయి. ఆ సమయంలో కొత్త జిల్లాల కేంద్రంగా రాజకీయంగా బలోపోతేం అయ్యే దిశగా నేతలు అడుగులు వేయనున్నారు.