పింఛన్ల రద్దుపై ఫిర్యాదుల వెల్లువ-జగన్ సర్కార్ కీలక నిర్ణయం-వీరికి మాత్రమే ఊరట
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించిన కీలక హామీల్లో పెన్షన్ల పెంపు కూడా ఒకటి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓసారి మాత్రమే పెన్షన్ పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మౌనంగా ఉండిపోతోంది. అయితే పింఛన్ల పెంపు సంగతి తర్వాత ఉన్న వారికే పింఛన్ తొలగిస్తుండటంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పందనలో ఈ ఫిర్యాదుల వ్యవహారం కలకలం రేపుతోంది. దీంతో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

వైసీపీ సర్కార్లో పింఛన్లు
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో లక్షలాదిగా కొత్త పింఛన్లను ఇచ్చారు. వీరిలో అర్హులు, అనర్హులన్న లెక్క లేకుండా ప్రతీ సిఫార్సును ఆమోదించి పింఛన్లు ఇచ్చేశారు. కానీ ఆ తర్వాత వాటిలో లక్షలాది పింఛన్లు అనర్హులుగా తేల్చి కోతలు విధిస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వంపై పింఛన్లు తీసుకుంటున్న పేదల్లో అసంతృప్తి పెరుగుతోంది. అదే సమయంలో విపక్షాల విమర్శలూ తీవ్రమవుతున్నాయి. పేదలకు సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం అభాసుపాలవుతోంది. దీంతో సర్కార్ కూడా పునరాలోచనలో పడాల్సిన పరిస్ధితి.

పింఛన్ల కోతలపై ఫిర్యాదుల వెల్లువ
పింఛన్లలో భారీ ఎత్తున విధిస్తున్న కోతలపై వైసీపీ సర్కార్ పై విమర్శలు పెరుగుతున్నాయి. అదే సమయంలో పింఛన్లు కోల్పోయిన లబ్దిదారుల నుంచి ఫిర్యాదులూ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ప్రారంభించిన స్పందన పోర్టల్, కాల్ సెంటర్ కు పింఛన్ ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. దీంతో స్పందన కాల్ సెంటర్ కాస్తా పింఛన్ల ఫిర్యాదుల కాల్ సెంటర్ గా మారిపోతోంది. దీంతో ఈ వ్యవహారం సీఎం జగన్ దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా జరిపిన సమీక్షల్లో స్పందనకు పింఛన్లపై వస్తున్న ఫిర్యాదుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వీటి పరిష్కారానికి నడుం బిగించింది.

మరో అవకాశమివ్వాలని నిర్ణయం
పింఛన్లలో కోతల కారణంగా భారీ ఎత్తున లబ్దిదారులు నష్టపోతున్నారు. దీంతో ప్రభుత్వం గతంలో అనర్హులుగా గుర్తించి కోతలు విధించిన పెన్షన్లపై పునరాలోచనకు సిద్ధమైంది. ఇందుకోసం గతంలో కోతల్లో పింఛన్లు కోల్పోయిన లబ్దిదారులకు మరో అవకాశం ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో గతంలో అనర్హులై ణఫ్పుడు అర్హులైన వారికి పించన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో అన్యాయంగా తమకు పింఛన్ తీసేశారని భావిస్తున్న వారికి ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది.

వీరికే పింఛన్ల దరఖాస్తు అవకాశం
పింఛన్ల కోతల్లో బాధితులుగా మారిన వారిలో కొన్ని వాస్తవ బాధిత వర్గాలకు న్యాయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ సెర్ఫ్ ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందులో గతంలో పింఛన్లు తొలగించిన వారిలో నవశకం సర్వే ద్వారా అనర్హులుగా గుర్తించినవి, శాశ్వతంగా వలస వెళ్లారనే కారణంతో తొలగించినవి, సచివాలయ వెబ్ సైట్లో తిరస్కరణకు గురైనవి ఉంటే ఆయా లబ్ధిదారులకు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
అలా కాకుండా ఇతర మార్గాల్లో తిరస్కరణకు గురైన వారికి మాత్రం మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో కొంతమంది అర్హులకైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications