బాబు ఆపరేషన్ రివర్స్, జగన్ చెప్పిందే నిజమా?: టిడిపికి ఆప్షన్ 'వైసీపీ'
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అంతా రివర్స్ అవుతోందా? నిన్నటి దాకా తెలంగాణలో పెద్ద ఎత్తున పార్టీ ముఖ్య నేతలు కారు ఎక్కారు. ఇప్పుడు ఏపీ వంతు వచ్చిందా? జగన్ గతంలో చెప్పింది నిజమయ్యేనా? అనే చర్చ సాగుతోంది.
తెలంగాణలో టిడిపి అధికారంలో లేకపోవడం, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా లేకపోవడం, అంతకుమించి ఏపీలో టిడిపి అధికారంలో ఉండటం, చంద్రబాబు ఏపీ పైన దృష్టి సారించడం వంటి చాలా కారణాల వల్ల తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగా లేకుండా పోయింది.
కానీ ఏపీలో టిడిపి అధికారంలో ఉంది. పైగా నిన్నటి దాకా దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు వైసిపి అధినేత జగన్కు షాకిస్తూ సైకిల్ ఎక్కారు. తమ పార్టీలోకి మరికొంతమంది ఎమ్మెల్యేలు వస్తారని, దాదాపు నలభై మంది వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారని టిడిపి నేతలు గతంలో చెప్పారు. కానీ అది ఇరవైతో ఆగిపోయింది.
బాబుకు షాక్ ప్రారంభం!
తాజాగా, టిడిపి నుంచి వైసిపిలోకి వలస బాట పడుతున్నట్లుగా కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ.. జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీలో భంగపాటు కారణంగానే ఆయన వైసిపిలో చేరారని చెబుతున్నారు.
బీజేపీతో దోస్తీపై హోదా ఆగ్రహం
ఏపీకి చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించడం లేదని, అలాగే హోదా పైన హామీ ఇచ్చిన బీజేపీతోనే ఇంకా అంటకాగుతుండటం ఏపీ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తోందని, అందుకే టిడిపి నుంచి మరికొంతమంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటున్నారు.
బీజేపీతో దోస్తీపై టిక్కెట్ ఆగ్రహం
టిడిపిలోకి చేరికల వల్ల వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న కొందరు నేతలకు అది దక్కే అవకాశం లేదు. బీజేపీతో పొత్తు వల్ల కొన్ని టిక్కెట్లు ఆ పార్టీకి వెళ్తాయి. ఈ కారణంగా ఇప్పుటి నుంచే కొందరు నేతలు వైసిపి దారి చూసుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గాలపై బాబు ఆశలు అడియాసేనా?
ఇటీవలి వరకు టిడిపిలోకి చేరికలు జరిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయని, అప్పుడు అందరికీ పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు భావించారు. అదే విషయం పార్టీలో చేరిన వారికి, కొత్త చేరికతో అసంతృప్తితో ఉన్న పాత వారికి అదే విషయం చెబుతూ వచ్చారని తెలుస్తోంది.
ఆప్షన్ 'జగన్'
కొత్త స్థానాలు పెంచే యోచన కేంద్రం చేయడం లేదు. పైగా బీజేపీతో జట్టుగా ఉంది. తమకు సీట్లు దక్కవని, అదే సమయంలో వైసీపీలో కచ్చితంగా టిక్కెట్ దక్కుతుందనుకున్న నేతలు పార్టీని వీడుతున్నారని, త్వరలో మరికొందరు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.