పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా.. రాళ్ళ దాడికి భయపడను; చిరంజీవి జోక్యం చేసుకోవాలన్న పోసాని
పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణ మురళి రగడ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి దాడి చేసిన ఘటన నేపథ్యంలో మళ్లీ రచ్చ మొదలైంది. తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పోసాని కృష్ణ మురళి ఓ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తనను బెదిరిస్తున్న జనసేన, పవన్ అభిమానులే తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు.
చిరంజీవి జోక్యం చేసుకోవాలన్న పోసాని కృష్ణ మురళి
పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది తనకు ఫోన్ లో చంపేస్తామంటూ అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూనే ఉన్నారని, తన భార్య పైన కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికైనా చిరంజీవి కలుగజేసుకుని పవన్ కళ్యాణ్ ను మందలించవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కట్టడి చేసేలా ప్రయత్నించ వచ్చని పోసాని కృష్ణమురళి అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాదు గతంలోతాను చిరంజీవి ఫ్యామిలీ కోసం బలంగా మాట్లాడానని గుర్తు చేశారు. చిరంజీవి కుటుంబం పై గతంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తాను ముందు వరుసలో ఉండి వ్యాఖ్యలను ఖండించానని పేర్కొన్న పోసాని కృష్ణ మురళి ఇప్పుడు చిరంజీవి చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోనన్న పోసాని
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిట్టొచ్చు ఏమైనా తిట్టొచ్చు కానీ ఆయనను ఎవరూ తిట్టకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తన భార్యకు ఏదైనా సంబంధం ఉందా ? ఆమెను అందరూ తిట్టొచ్చా ? అంటూ పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఫ్యామిలీ జోలికి వస్తే తానూ ఊరుకోనని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ ది సైకో బుద్ధి అని, సర్దార్ గబ్బర్ సింగ్ లో తనను కావాలనే తీసేశారని, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కో డైరెక్టర్ పైన చేయి చేసుకున్నారని, పవన్ చేసింది తప్పని తెలిసినా సరే క్షమాపణ చెప్పలేదని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా .. రాళ్ళ దాడి బెదిరింపులకు భయపడను
తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని 35 సంవత్సరాల నుండి సినిమా పరిశ్రమలో ఉన్నారని పేర్కొన్నారు పోసాని కృష్ణ మురళి . మంత్రి పేర్నినానీని ఒరేయ్ సన్నాసి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చెయ్యొచ్చా అని ప్రశ్నించారు.ఈ విషయంలో తాను పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాను కాబట్టే అతను తనకు శత్రువుగా మారారు అంటూ వ్యాఖ్యానించారు.
తానురాళ్ల దెబ్బలకు భయపడిపోయేవాడిని కాదని, ఇలాంటి బెదిరింపులు చాలా చూశానని పేర్కొన్న ఆయన పవన్ కళ్యాణ్ ను తానొక్కడినే చెప్పుతో కొడతాను అంటూ మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా అయితే పవన్ ఫ్యాన్స్ నన్ను చంపేస్తారేమో అంతకంటే ఏం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు.
నాయకులు కొడతాం అంటే కార్యకర్తలు అదే చేస్తారు కదా!! పోసాని ఫైర్
పవన్ కళ్యాణ్ అభిమానులకు డబ్బులిచ్చి నాపై ఉసిగొల్పుతున్నారంటూ మండిపడ్డారు. రాజకీయంగా తనను ఏమన్నా పట్టించుకోనని కానీ తన ఫ్యామిలీ జోలికొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని పోసాని కృష్ణమురళి తేల్చిచెప్పారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గతంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ నాయకులను బట్టలూడదీసి కొట్టాలని అన్నారని, పవన్ కళ్యాణ్ లాక్కొచ్చి కొడతా అంటున్నారని, ఇప్పుడు పవన్ అభిమానులు తనను బట్టలూడదీసి కొడతాం అంటున్నారని, నాయకులు ఎలా ఉంటే కార్యకర్తలు అలాగే ఉంటారని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు.