ఏపీపైనా కాంగ్రెస్ దృష్టి-రెండ్రోజుల సమీక్ష-ఊమెన్ చాందీ రాక-మరో రేవంతుడి అన్వేషణ
ఏడేళ్ల క్రితం ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో నామమాత్రంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ పీసీసీ ఛీఫ్గా ఫైర్ బ్రాండ్ నేత రేవంత్రెడ్డిని నియమించిన కాంగ్రెస్ పార్టీ.. అక్కడ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో ఏపీలోనూ దూకుడుగా వెళ్లే నేతల కోసం ఎదురుచూస్తోంది. రెండు రోజుల పాటు తాజా పరిస్ధితులను అంచనావేసేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇవాళ బెజవాడలో సమావేశమవుతోంది.
Recommended Video

ఇక ఏపీపై కాంగ్రెస్ దృష్టి
ప్రజలు కోరుకోని విభజనను బలవంతంగా రుద్దడం ద్వారా ఏపీలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికల్లో అందుకు తగ్గ ఫలితాల్ని అనుభవించాల్సి వచ్చింది. అయితే ఏపీలో కాంగ్రెస్ స్ధానాన్ని ఆక్రమించిన వైసీపీ భారీ మెజారిటీతో అధికారం చేపట్టడం, అయినా విభజన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేని పరిస్దితుల్లో ఉండటంతో తిరిగి కాంగ్రెస్ వైపు ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మే పరిస్దితి లేదు. దీంతో క్యాడర్ సాయంతో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి విజయవాడలో జరిగే రెండు రోజుల సమీక్షలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఊమెన్ చాందీతో పాటు మెయ్యప్పన్ వంటి నేతలు హాజరవుతున్నారు. ఏపీసీసీ ఛీఫ్ శైలజానాధ్ ఈ సమీక్షలో పాల్గొంటారు.

ఏపీకో రేవంత్రెడ్డి అన్వేషణ
రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో సైతం జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. చేజేతులా తన స్ధానాన్ని బీజేపీకి అప్పగిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో గతంలో టీడీపీ నుంచి అరువుతెచ్చుకున్న రేవంత్రెడ్డికే పగ్గాలు అప్పగించింది.
ఇప్పుడు రేవంత్ పగ్గాలు చేపట్టడంతో తెలంగాణలో పార్టీ తిరిగి బలోపేతం అవుతుందని భావిస్తున్న కాంగ్రెస్.. ఏపీలోనూ అదే తరహాలో దూకుడుగా వ్యవహరించే నేతల కోసం ఎదురుచూస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కార్పోరేటర్ అయ్యే పరిస్ధితి కూడా లేదన్న అంచనాలతో నేతలు వెనుకంజ వేస్తున్నారు. దీంతో అందుబాటులో ఉన్న ఆప్షన్లలో మెరుగైన నేత కోసం కాంగ్రెస్ అన్వేషిస్తోంది.

కిరణ్కుమార్రెడ్డిని ఒప్పించే ఛాన్స్ ?
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్ధితికి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్కుమార్రెడ్డి కారణమనే విమర్శలు వినిపిస్తుంటాయి. మరికొందరు కాంగ్రెస్ పార్టీ చివరి వరకూ ముక్కలు కాకుండా చూసింది కిరణ్కుమార్రెడ్డేనని ఆయన సన్నిహితులు
చెప్తుంటారు. ఏదేమైనా రాష్ట్ర విభజన తర్వాత సొంత పార్టీ పెట్టిన కిరణ్ ఎన్నికల్లో పోటీ చేసి దారుణమైన ఫలితాలు చవిచూశారు. దీంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయినా యాక్టివ్గా ఉండటం లేదు. కానీ మారిన పరిస్ధితుల్లో అటు తెలంగాణలో రేవంత్రెడ్డినియామకం నేపథ్యంలో ఆ ప్రభావం ఏపీపైనా ఉండాలంటే కిరణ్ వంటి నేత అయితే బావుంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో కిరణ్వైపు చూసే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications