ఆ తర్వాతే: సుప్రీం ఆదేశంపై వినోద్, మాట వింటే: కిషోర్
హైదరాబాద్: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ఎంసెట్ కౌన్సెలింగ్ పైన నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు వినోద్ సోమవారం అన్నారు. న్యాయమూర్తులు ప్రస్తుతం కేవలం తమ అభిప్రాయం మాత్రమే తెలిపారని, కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతే తాము ఈ నిర్ణయంపై సమాలోచన చేస్తామన్నారు. కోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనలు నెగ్గాయనడం సరికాదన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదన్న సంగతి ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుసుకోవాలన్నారు. తొమ్మిది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూడడం కేసీఆర్కు తగదన్నారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో ముందే తమ మాటను కేసీఆర్ విని ఉంటే సుప్రీం కోర్టుతో చెప్పించుకునే అవసరం తప్పేదన్నారు. ఇప్పటికైనా ఉమ్మడి అడ్మిషన్లకు ఎలాంటి ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.
కాగా, ఆగస్టు 31వ తేదీలోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు నుండి తరగతులు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఆదేశించింది. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు స్పందిస్తున్నారు.