అగ్రిమెంట్స్ అమలుకాలేదు: డిఎస్, బొత్స కాలేజ్పై దాడి
కొత్త పార్టీపై ఆలోచిస్తాం: కాసు
విభజన నిర్ణయం సరికాదని దానిపై అధిష్టానం పునరాలోచన చేయాలని మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి చెప్పారు. విభజన నిర్ణయాన్ని అందరు కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నారు. తాను కాంగ్రెసులో పుట్టిన వ్యక్తినని కానీ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం పెద్ద విషయం కాదని కానీ, అసెంబ్లీలో తీర్మానం ఓడించాల్సి ఉందన్నారు. పదవులు తమ కుటుంబానికి కొత్త కాదన్నారు. పరిస్థితులను బట్టి కొత్త పార్టీపై ఆలోచిస్తామని చెప్పారు. అవసరమైతే రాజీనామాలు గవర్నర్కు పంపించాలని కిరణ్ను కోరామన్నారు.
జగన్ పైన సోమిరెడ్డి ఫైర్
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కుమ్మక్కై విభజనకు సహకరించినందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎపిఎన్జీవోల త్యాగాలను జగన్ హైజాక్ చేయాలని చూస్తున్నారని, సమైక్య ఉద్యమాన్ని జగన్ తన అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 72 గంటల బందుకు పిలుపునిచ్చేందుకు ఆయనెవరని ప్రశ్నించారు.
సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు జాతీయ పార్టీలు ముందుకు రావాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ పైన చర్చ జరగాలన్నారు. హైదరాబాదు దొరల చేతుల్లోకి వెళ్తే అభివృద్ధి జరిగినట్లా అని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉందన్నారు.
బొత్స కళాశాలపై దాడి
విజయనగరంలోని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన కళాశాల పైన సమైక్యవాదులు దాడి చేశారు. విద్యార్థులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బాష్పవాయువు, లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
రాజీనామా ఇచ్చా కానీ: పల్లం రాజు
తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు రాజీనామా లేఖ ఇచ్చానని కానీ ఆయన ఆమోదించలేదని కేంద్రమంత్రి పల్లం రాజు తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా మంత్రి పదవిలో కొనసాగాలని సూచించారని, తాను మాత్రం రాజీనామాకే కట్టుబడి ఉన్నానని చెప్పారు.