టీడీపీ చేయలేని పని అది- వైసీపీ చేసి చూపించింది
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను గెలిపించాలని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ విజ్ఞప్తి చేశారు.
అమరావతి: ఏపీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల కోసం మార్చి 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ పోటీలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ నుంచి వేపాడ చిరంజీవీరావు, పీవీఎన్ మాధవ్ బరిలో నిలిచారు.

సీతంరాజు కోసం..
ఈ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను గెలిపించాలని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ విజ్ఞప్తి చేశారు. చాలాకాలం తరువాత బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమకు చట్టసభల్లో ప్రాతినిథ్యాన్ని కల్పించారని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడే ఆ అవకాశం దక్కిందని పేర్కొన్నారు.

టీడీపీ ఎప్పుడూ టికెట్ ఇవ్వలేదు..
ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమకు టికెట్ ఇవ్వలేదని ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడెప్పుడో కరణం రామచంద్రరావుకు స్థానం కల్పించారని, ఆ తరువాత ఎప్పుడూ బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబు తమ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూశారని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ, లోక్ సభలకు పంపించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

జగన్ తో మళ్లీ..
ఇప్పుడు చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం దక్కిందని రవికుమార్ వ్యాఖ్యానించారు. ఉన్నత చదువులు చదివిన, బ్రాహ్మణ నాయకుడు సీతంరాజు సుధాకర్ ను ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని, దీనికి తాము జగన్ కు కృతజ్ఞతలు తెలిపుకుంటున్నామని అన్నారు. లోకా సమస్త సుఖినోభవంతు.. అంటూ సమాజ హితాన్ని కోరుకునే తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రాజకీయ ఉనికిని కోల్పోయే దశలో..
రాజకీయంగా ఉనికిని కోల్పోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ తమకు శాసనమండలికి వెళ్లే అవకాశం ఇచ్చారని, గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ కు ఓటు వేయాలని ద్రోణంరాజు రవికుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలో 33 మంది బ్రాహ్మణులు శాసన సభకు ఎంపికయ్యారని, ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు పడిపోయిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో శాసన మండలికి ప్రాతినిథ్యాన్ని వహించే అవకాశం తమకు దక్కిందని పేర్కొన్నారు.

ఉనికి లేకుండా చేశారు..
చట్టసభల్లో బ్రాహ్మణుల ఉనికి లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశమేనని తాము ఖచ్చితంగా చెప్పగలుగుతామని ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టారని, ఆ పరిస్థితిని గుర్తించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యేలు, రెండు ఎమ్మెల్సీ, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించారని చెప్పారు. ఆ తరువాత మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు తమకు ప్రాతినిథ్యం లేకుండాపోయిందని అన్నారు. అగ్రకులాల్లో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గం బ్రాహ్మణులేనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications