ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన-కొత్త పీసీసీ ఛీఫ్ పై ఏఐసీసీ దృష్టి-సీనియర్లకు రాహుల్ ఢిల్లీ పిలుపు
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో కుదేలైన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఏఐసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుతో ప్రక్షాళన ప్రారంభించబోతోంది. దీని కోసం సీనియర్లను ఢిల్లీ రావాలని రాహుల్ గాంధీ నుంచి పిలుపు అందింది. వచ్చే 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మార్పుల ప్రక్రియ ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.

త్వరలో ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేందుకు ఏఐసీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ తరహాలోనే ఫైర్ బ్రాండ్ పీసీసీ ఛీఫ్ ఎంపికతో పాటు పలు కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై పార్టీలోని నేతలకు సంకేతాలు పంపుతున్నారు. త్వరలో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఈ మార్పులు చేపట్టనున్నారు. తద్వారా ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపాలని భావిస్తున్నారు.

సీనియర్లకు ఢిల్లీ పిలుపు
ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీలో సీనియర్లతో ముందుగా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సీనియర్లను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఢిల్లీ రాహుల్ గాంధీతో సమావేశానికి రావాలని వీరిని ఆహ్వానిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఈ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా ప్రతీ నేతతో మాట్లాడి కార్యాచరణ ఖరారు చేయబోతున్నారు.

పీసీసీ అధ్యక్షుడి మార్పు
ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ను మార్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. శైలజా నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపడం సాధ్యం కాదని భావిస్తున్న హైకమాండ్.. ఆయన స్ధానంలో రేవంత్ రెడ్డి తరహా నేతను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందుకోసం సీనియర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడి, మళ్లీ పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని లీడ్ తీసుకోవాలని అధిష్టానం కోరే అవకాశముంది. ప్రస్తుతం రెడ్ల నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ణధికారంలో ఉన్నందున ఇందుకు కౌంటర్ గా కిరణ్ ను పీసీసీ ఛీఫ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై రాహుల్ దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications