వరదల్లో ప్రాణాలకు తెగించి సేవలు - 64 మంది ప్రాణాలు కాపాడి : నాలుగు జిల్లాల్లో ఆ బృందాలు..!!
భారీ వర్షాలు..వరదలతో రాయలసీమ లోని నాలుగు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో 1300 పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 24 మంది మరణించ గా.. 17 మంది గల్లంతు అయ్యారు. అయితే, వరద నీటితో మరింత ప్రాణ నష్టం జరగకుండా అలుపెరగకుండా సేవలందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్ఫోర్స్ బృందాల కారణంగా 64 మంది ప్రాణాలు దక్కాయి. ఈ బృందాలు నాలుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన 64 మందిని రక్షించారు.
ముంపు ప్రాంతాల్లో ఆ బృందాల సేవలు
వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యల్లో తూర్పు నౌకాదళానికి చెందిన బృందాలు నిమగ్నమయ్యాయి. ఐఎన్ఎస్ డేగా నుంచి ఒక సీకింగ్ హెలికాఫ్టర్లో నౌకాదళ బృందం బయలుదేరి కడప జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. వరదల్లో చిక్కుకున్న అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతం, నందలూరు ప్రాంత ప్రజలకు 6,600 ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, 3,600 కిలోల రిలీఫ్ మెటీరియల్ను అందించారు. వైఎస్సార్ జిల్లాలో పాపాగ్ని నది వరదలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రోప్ల సాయంతో కాపాడారు. హేమాద్రిపురంలో ఒక సీఐ సహా ఏడుగురిని రక్షించారు.
వారి ప్రాణాలకు తెగించి..ప్రాణాలు కాపాడి
పాపాగ్ని నదికి గండి పడడంతో కొట్టుకుపోతున్న ముగ్గురు వ్యక్తులు, 15 పశువులను ఫైర్ సిబ్బంది కాపాడారు. కడప నగరంలో బుగ్గవంక వరద నీటితో నిండిపోయిన ఒక ఇంటి నుంచి గర్భిణిని రక్షించారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతిలో చిక్కుకుపోయిన పది మందిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు. వైఎస్సార్ జిల్లా చెయ్యూరులో వరద నీటిలో ప్రమాదకరంగా చిక్కుకుపోయిన మూడు ఆర్టీసీ బస్సుల నుంచి 35 మందిని రక్షించారు. 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎయిర్ ఫోర్స్, ఫైర్ సర్వీస్ బృందాలు సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొన్నాయి.
శిబిరాలకు తరలింపు... ఆహారం అందిస్తూ
అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో జల దిగ్భంధమైన వారిని రక్షించేందుకు రెండు హెలికాఫ్టర్లను ఉపయోగించారు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 243 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 20,923 మందిని అక్కడికి తరలించారు. వారికి ఆహారంతోపాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. నాలుగు రోజులుగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సగటున 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వైఎస్సార్ జిల్లాలో 14.4 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లాలో 12.6, అనంతపురం జిల్లాలో 11.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వరదలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో కోస్టుగార్డు బృందాలు చురుగ్గా పాల్గొన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లోని ప్రజలకు ఎప్పటికప్పుడు ఆహార పొట్లాలతో పాటుగా వారికి కావాల్సినవి అందిస్తున్నాయి. అధికారులు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న వారిని ఈ బృందాలు గుర్తించి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి.