అఖిలప్రియ అంత మాటన్నారా?: నంద్యాల వ్యాపారులపై అసంబద్ధ వ్యాఖ్యలు
కర్నూలు: నంద్యాల వ్యాపారులపై ఏపీ మంత్రి అఖిలప్రియ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పలు మీడియాల్లో వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. వ్యాపారుల మనోభావాలు దెబ్బతినేలా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమె మాటలు విన్న వ్యాపారులు ఒక్కసారిగా కంగుతిన్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నంద్యాలలోని గాంధీచౌక్ సమీపంలో ఉన్న కూరగాయల మార్కెట్లో వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు అఖిలప్రియ, కాలవ శ్రీనివాసులు, చంద్రమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరూక్, షరీఫ్, వక్ఫ్బోర్డు చైర్మన్ నౌమన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. 'మా నాన్న భూమా నాగిరెడ్డి మీ దరిద్రాన్ని మోశాడు. కావున మార్కెట్ వ్యాపారులంతా మా వెంట నిలబడాలి' అంటూ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
అంతేగాక, వ్యాపారులకు కొన్ని హామీలు కూడా ఇస్తూ మభ్యపెట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, అఖిలప్రియ వ్యాఖ్యలపై వ్యాపారులు కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలిసింది.