అమరావతికి చకచకా ఏర్పాట్లు, హైద్రాబాద్లో 'రాయలసీమ' డిమాండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ నెల 19వ తేదీ నాటికి పూర్తి ఏర్పాట్లు చేస్తామని అధికారులు వెల్లడించారు. రేపటిలోగా ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజధాని శంకుస్థాపన కోసం జరుగుతున్న పనుల్లో వెయ్యి మందికి పైగా కార్మికులు పాల్గొంటున్నారు. శంకుస్థాపనకు హాజరయ్యే వారుకు 150 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన దసరా పర్వదినం నాడు గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరగనుంది.
ఈ నేపథ్యంలో శంకుస్థాపన వేదికకు చేరుకునే రోడ్లు, బైపాస్ రోడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. చాలా పనులు తుది దశలో ఉన్నాయి. శంకుస్థాపన రోజున ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

సభాస్థలి వద్ద మెరుగైన కమ్యూనికేషన్ కోసం బిఎస్ఎన్ఎల్ సంస్థ మొబైల్ టవర్ ఏర్పాటు చేసింది. విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకు విద్యుత్ శాఖ అదనంగా ట్రాన్స్ఫార్మార్లను ఏర్పాటు చేస్తోంది. శంకుస్థాపన ప్రాంతం వద్ద ఐజీ, ఎస్పీస్థాయి అధికారుల పర్యవేక్షణలో కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి.
శంకుస్థాపన ప్రాంగణం వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల కోసం ఏపీలోని 13 జిల్లాల నుంచే కాక తెలంగాణ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశమున్నందున 2275 బస్సులు అవసరమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో చాలామంది ఇప్పటికే వస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరగడంతో ఆదివారం విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ జాం అయింది.
వారు వస్తారా?
రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కెసిఆర్ను స్వయంగా కలిసి చంద్రబాబు ఆహ్వానిస్తారు. ఇప్పటికే జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. వైసిపి అధ్యక్షులు జగన్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే జగన్ తీరుపై పార్టీ నేతలు పలువురు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
జగన్ను రాజధాని శంకుస్థాపన వేడుకకు పంపించేలా పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శంకుస్థాపన రోజున పవన్ కళ్యాణ్కు గుజరాత్లో షూటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన హాజరవుతారా అనేది అనుమానంగానే ఉంది. మరోవైపు, కెసిఆర్కు డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రోగ్రాం ఉంది. దీనిని వాయిదా వేసుకొని అమరావతికి రావొచ్చని భావిస్తున్నారు.
శంకుస్థాపన ఏర్పాట్లు - 'రాయలసీమ' డిమాండ్
ఏపీ రాజధాని అమరావతిగా వద్దని, రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని రాయలసీమ అభ్యుదయ వేదిక ఇందిరా పార్క్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించింది. సీమ ప్రాంతంలో రాజధానిని నిర్మించాలన్నారు. అన్ని విషయాల్లో ప్రభుత్వం సీమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాయలసీమకు నిధులు, నీళ్లు ఇవ్వరని ఆరోపించారు.












Click it and Unblock the Notifications