నడి వీధిలో ఘోర అవమానం..గ్రామ వలంటీర్ ఆత్మహత్య: సర్కార్ సీరియస్!
ఏలూరు: ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారుల ఇంటి వరకు చేర్చడానికి ఉద్దేశించిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ పట్ల చిన్నచూపు చూస్తున్నారు కొందరు వ్యక్తులు. రాజకీయపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని వారిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. ఈ పరిణామం అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తోంది. వలంటీర్ గా తన గుమ్మం తొక్కిన ఓ యువతి పట్ల దురుసుగా ప్రవర్తించిందో మహిళ. దుర్భాషలాడింది. అనరాని మాటలతో శాపనార్థాలు పెట్టింది. నడి వీఢిలో తనను అవమానపర్చడాన్ని భరించలేని ఆ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పండువారి గూడెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గ్రామ వలంటీర్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది. బాధ్యతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా పోలీసులను ఆదేశించింది. నవీన ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై సమగ్ర నివేదికను అందజేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ అధికారులు జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆధార్ కార్డులో ఇంటి పేరు సవరణ కోసం
మృతురాలి పేరు పండు నవీన. వయస్సు 19 సంవత్సరాలు. డిగ్రీ పూర్తి చేసిన నవీన..కిందటి నెల 15వ తేదీన గ్రామ వలంటీర్ గా నియమితులయ్యారు. జీలుగుమిల్లి మండలం పండువారి గూడెంలో గ్రామ వలంటీర్ గా ఆమెను నియమించారు. విధి నిర్వహణలో భాగంగా.. ఆమె వారం రోజుల కిందట అదే గ్రామానికి చెందిన పండు మంగ అనే మహిళ ఇంటికి వెళ్లారు. మంగ ఇంటి పేరు పండు. ఆధార్ కార్డు సహా ఆతర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మంగ ఇంటి పేరు పెన్నంగా నమోదైంది. దీన్ని మార్చాలని ఆమె కోరారు. ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగా సంక్షేమ పథకాల్లో పేరు నమోదు చేస్తారని నవీన ఆమెకు వివరించారు. ఆధార్ కార్డులో పేరు మార్చాలని మంగ గ్రామ వలంటీర్ ను కోరారు. దీనికి అంగీకరించిన నవీన.. దీనికి సంబంధించిన పత్రాలను తీసుకుని.. ఆన్ లైన్ ద్వారా ఆధార్ కార్డులో సవరణ చేసినట్లు చెబుతున్నారు.
జాప్యం చోటు చేసుకుందనే ఆగ్రహం..
అయిదురోజులైనప్పటికీ.. ఆధార్ కార్డులో ఇంటి పేరు మారకపోవడంతో మంగ ఆగ్రహానికి గురయ్యారు. తన ఇంటి వద్దకు వచ్చిన నవీన పట్ల తన కోపాన్ని ప్రదర్శించారు. ఆధార్ కార్డులో సవరణలు చోటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని నవీన వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. నడివీధిలో నవీనను దుర్భాషలాడారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన.. ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నవీన తండ్రి శ్రీరామ్మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనాస్థలం నుంచి వారు నవీన రాసినట్టుగా అనుమానిస్తోన్న ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వం సీరియస్..
ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వలంటీర్ల వ్యవస్థను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోవడం పట్ల జిల్లా పాలన, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామ వలంటీర్లను కించపరిచేలా, వారి మనోభావాలను అగౌరవ పరిచేలా ఎవరు ప్రవర్తించినా.. ఉపేక్షించకూడదని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ అధికారులు ఆదేశాలు చేశారు. నిందితులపై క్రిమిపల్ చర్యలను నమోదు చేయాలని సూచించారు. మున్ముందు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులు జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు తెలుస్తోంది.