అమరావతి రైతుల మహా పాదయాత్ర నాలుగో రోజుకు.. సేవ్ అమరావతి అంటూ .. ఈ రోజు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఉదృతం చేసే క్రమంలో న్యాయస్థానం టూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈరోజు అమరావతి రైతు మహా పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది.
నాలుగో రోజు పాదయాత్ర ఇలా
బుధవారం నాడు గుంటూరు అర్బన్ లో పాదయాత్ర సాగించిన రైతులకు గుంటూరు అర్బన్ ప్రజలు పూలతో స్వాగతించి సంఘీభావాన్ని ప్రకటించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అన్న ఆకాంక్షను వివిధ జిల్లాల ప్రజల మద్దతుతో ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్న అమరావతి ప్రాంత రైతులు గురువారం 4వ రోజు మహా పాదయాత్ర లో భాగంగా సుమారు పదకొండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
బుధవారం రోజు మూడవరోజు పాదయాత్రలో గుంటూరు శివారు ప్రాంతాల నుండి పుల్లడిగుంట వరకు పాదయాత్ర చేశారు. నేడు గురువారం పుల్లడిగుంట నుండి ప్రత్తిపాడు వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

మహా పాదయాత్ర ద్వారా అమరావతి ఉద్యమాన్ని విస్తరించటమే లక్ష్యం
అమరావతి పరిరక్షణ సమితి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. అమరావతి పరిరక్షణ కోసం, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడం లక్ష్యంగా మహా పాదయాత్ర కొనసాగుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలలోని 70 ప్రధాన గ్రామాల మీదుగా కొనసాగనున్న ఈ మహా పాదయాత్ర డిసెంబర్ 15వ తేదీన తిరుపతిలో ముగియనుంది.
సేవ్ అమరావతి నినాదంతో రాజధాని రైతుల పోరాటం
సేవ్ అమరావతి నినాదంతో రాజధాని ప్రాంత రైతులు ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి సాగిస్తున్న ఈ పోరాటానికి వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని పోరాటానికి మద్దతు ప్రకటించారు. రాజధాని అమరావతి కొనసాగుతూ పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారమయం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు పాదయాత్ర సాగుతుంది ఇలా ...
న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో రైతులు తుళ్లూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు 45 రోజులపాటు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర సోమవారం తొలి రోజు పాదయాత్రలో భాగంగా రాజధాని రైతులు 14.5 కిలోమీటర్ల మేర నడిచి పాదయాత్రను కొనసాగించారు. రెండో రోజు తాడికొండ నుండి గుంటూరు శివారు వరకు 12.6 కిలోమీటర్ల పాదయాత్రను సాగించిన అమరావతి రైతులు, మూడో రోజు పాదయాత్రలో బుధవారం 10.8 కిలోమీటర్ల మేర గుంటూరు నగరంలో పాదయాత్ర చేశారు. 3 రాజధానులను రద్దు చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, సి ఆర్ డి ఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు గుంటూరు నగరవాసులు సంఘీభావం తెలిపారు. నాలుగోరోజు ప్రత్తిపాడు వరకు అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగనుంది.












Click it and Unblock the Notifications