పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల పాదాలకు పాలాభిషేకం; నెల్లూరులో 24వ రోజు పాదయాత్ర ఇలా!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో మొదలైన రాజధాని అమరావతి ఉద్యమం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, పంటలు పండే భూములను త్యాగం చేశామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం తాము త్యాగం చేస్తే జగన్ సర్కార్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని, ఏపీ రాజధానిగా అమరావతి నగరమే కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమంలో భాగంగా రాజధాని ప్రాంత రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. వర్షాలు, వరదల మధ్య పాదయాత్రకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నా సరే పాదయాత్ర కొనసాగుతుంది.
నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర .. మహిళల పాదాలకు పాలాభిషేకం
ఏపీ రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న మహా పాదయాత్రకు రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. గత ఇరవై నాలుగు రోజులుగా పాదయాత్ర చేసి కాళ్లు బొబ్బలెక్కిన మహిళలకు నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబు క్షీరాభిషేకం చేశారు. అలాగే పాదయాత్రకు తనవంతుగా మూడు లక్షల రూపాయల విరాళాన్ని కూడా అందజేశారు.
పాదయాత్ర నిర్విఘ్నంగా ముందుకు సాగాలంటూ మహిళల పాదాలను పాలతో అభిషేకించారు. ఇప్పటికే అనేక అవాంతరాల మధ్య రాజధాని రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా టిడిపి నేత బీద రవిచంద్ర కూడా మహా పాదయాత్రకు మూడు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
రాజధానిగా అమరావతిని సాధించే వరకు పోరాటం ఆపేది లేదు
150 మంది నడిస్తే ఎవరు వస్తారు.. ఎవరు చూస్తారు అనుకుని డీజీపీ 157 మందికి అనుమతి ఇచ్చారు.కానీ ఇక్కడ వేల అడుగులు పడుతున్నాయి. కోటి గొంతుకలు మాట్లాడుతున్నాయి. పిడికిలి బిగించి జై అమరావతి అంటూ ఆత్మవిశ్వాసంతో గ్రామాలు, రైతులు ముందుకు సాగుతున్నాం అంటూ అమరావతి రైతులు తమ పోరాటానికి మద్దతుగా ప్రజలు ఉన్నారని చెప్తున్నారు.
ఇది ప్రజాపాదయాత్ర అని, ఒక్క అడుగుతో మొదలై వేల అడుగులు పడుతున్నాయి. రేపు లక్ష అడుగులు పడతాయని అంటున్నారు. వెనకడుగు వేసేదే లేదని చెప్తున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా సాధించేవరకు భవిషత్తులో మిగిలిన జిల్లాలలో కూడా పాదయాత్ర చేస్తామని తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వదిలి అభివృద్ధి వైపు అడుగులు వెయ్యాలని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇలా
ఇదిలా ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లా సున్నం బట్టి నుంచి మొదలైన పాదయాత్ర రాజుపాలెం వరకు కొనసాగనుంది. 15 కిలోమీటర్ల మేర ఈ రోజు మహా పాదయాత్రను రాజధాని అమరావతి రైతులు కొనసాగించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా పాదయాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది.
గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలోని 70 ప్రధాన గ్రామాల మీదుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుంది. అంతే కాదు మహాపాదయాత్రకి సంఘీభావంగా కృష్ణజిల్లా విజయవాడలో పాదయాత్ర చేశారు మహిళలు. వర్షం సైతం లెక్క చేయకుండా అమరావతి రాజధానిగా ఉంచాలని, సేవ్ అమరావతి అంటూ నినదించారు.
రాజధాని అమరావతి కాకుండా ప్రజలకు నష్టం చేసే బిల్లులు పెడితే ఉద్యమం మరింత ఉధృతం
ఇదిలా ఉంటే మూడు రాజధానులు చట్టాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం మళ్లీ ప్రజలకు నష్టం చేసే బిల్లును ప్రవేశపెడితే తాము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అమరావతి జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని వారంటున్నారు.
ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టే కొత్త బిల్లులో ఏముంటుందో అన్న ఉత్కంఠ అందరిలో ఉందని, అమరావతి రాజధానిగా కొనసాగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి జేఏసీ నేతలు. అప్పటివరకు రాజధాని రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెబుతున్నారు.